ఎంపికైన ఉపాధ్యాయులకు షాక్.. డీఎస్సీ కౌన్సెలింగ్‌పై విద్యాశాఖ కీలక ప్రకటన

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ షాకిచ్చింది.

Update: 2024-10-15 04:27 GMT

దిశ, వెబ్‌డెస్క్/మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ షాకిచ్చింది. ఈ రోజు (మంగళవారం) అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేస్తారనుకుంటున్న సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నామని, తదుపరి కౌన్సెలింగ్ తేదీలను త్వరలో వెల్లడిస్తామని వెల్లడించింది. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపులు, కొత్తగా అప్డేట్ అయిన ఉన్నత పాఠశాలలకు పోస్టుల కేటాయింపులు, తదితర వివరాలు సేకరించడం ఆలస్యం కావడంతోనే  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు సమాచారం పంపడంతో పాటు కౌన్సెలిం‌గ్‌కు హాజరైన కొత్త ఉపాధ్యాయులకు జిల్లాల వారీగా అటెండెన్స్ తీసుకొని పంపించారు. కాగా సాయంత్రం తరువాత కౌన్సిలింగ్ ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లకు అక్టోబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. దీంతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తెగ ఖుషీ అయిపోయారు. ఇక కౌన్సెలింగ్ తర్వాత పోస్టింగ్ పట్టేయడమే అనుకున్నారు. కానీ, ఈ రోజు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన తరుణంలో ఇలా ఆఖరి నిముషంలో విద్యాశాఖ వాయిదా ప్రకటన రావడంతో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులంతా షాక్‌కు గురయ్యారు.

Read More : గ్రూప్ 1 మెయిన్స్‌కు కోర్టు గ్రీన్‌ సిగ్నల్


Similar News