నేను చాలా స్ట్రిక్ట్...కాలేజీ ప్రిన్సిపల్ తరహాలో ఉంటా: మున్షి

తాను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని, కాలేజీ ప్రిన్సిపల్ తరహాలో తన మానిటరింగ్ ఉంటుందని ఏఐసీసీ ఇన్‌చార్జీ దీపా దాస్ మున్షి(Deepa Das Munshi) స్పష్టం చేశారు.

Update: 2024-09-15 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తాను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని, కాలేజీ ప్రిన్సిపల్ తరహాలో తన మానిటరింగ్ ఉంటుందని ఏఐసీసీ ఇన్‌చార్జీ దీపా దాస్ మున్షి(Deepa Das Munshi) స్పష్టం చేశారు. అయితే పార్టీ కోసం సిన్సియర్‌గా పనిచేసే కార్యకర్తలు, లీడర్లపై ప్రేమ కూడా చూపుతానని ఆమె వివరించారు. ఆదివారం మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పీసీసీ బాధ్యతల స్వీకరణ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. గాంధీభవన్‌(Gandhi Bhavan)లో నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేష్​ కుమార్ గౌడ్ క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోగ్రామ్స్, పథకాలను పార్టీ కార్యకర్తలు జనాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వం, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత పదవులు, ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందుకు పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియామకమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నామన్న డిప్యూటీ సీఎం, మళ్లీ ప్రజలకు పంచుతున్నామని వివరించారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వబోతున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని, అందుకు ప్రతి కార్యకర్త మిలిటెంట్‌గా పని చేయాల్సిన​అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని నొక్కి చెప్పారు. సెప్టెంబర్ 17thపై బీజేపీ ఏదేదో ప్రకటనలు చేస్తూ, పబ్బం గడుపుతోందన్నారు. తెలంగాణ భారత్‌లో విలీనం అవడం, తాజాగా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ కుట్రలను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలన్నారు.


Similar News