పదేళ్లు రైతులకు అండగా ఉన్నాం: మాజీ మంత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-08-16 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ పెద్ద మోసమని అన్నారు. అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే.. అది రేవంత్ సర్కారుకు దక్కుతుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని పదే పదే చెప్పారు. కానీ, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో విఫలం అయ్యారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు. ఆరు గ్యారంటీలు గడువులోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. ఆ విషయాన్ని రుణమాఫీ చుట్టూ తిప్పి అరకొరగా అమలు చేసి రుణమాఫీ అయిపోయిందని దబాయిస్తూ రాజీనామా చేయాలని దుర్భాషలాడడం సరికాదు. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత హరీష్ రావు.

అలాంటి వ్యక్తిపై అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారు.. ప్రభుత్వం 44 లక్షల మంది అని లెక్కలు చెబుతున్నది.. మరి ప్రభుత్వం ఎందుకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ ఎందుకు చేసింది? అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ.300 కోట్లు వరకు ఖర్చు చేశారని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రూ.29 వేల కోట్లు రుణమాఫీ, రూ.72 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు అందజేసి అండగా నిలిచామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా విడత కింద ఒక్కసారికి రూ.15 వేల కోట్లు అవసరం అవుతుంది.. రైతుభరోసా ఎగ్గొట్టి రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను మోసం చేసిందని అన్నారు. గ్రామ పంచాయతీలతో పారిశుద్ధ కార్మికులకు, పాఠశాలలో వంట కార్మికులకు వేతనాలు రాక గ్రామాలలో తండ్లాడుతున్నారని అన్నారు.

Tags:    

Similar News