ROR Act 2024 Draft. రెవెన్యూ కోర్టు Vs ట్రిబ్యునల్

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ని తీసుకొస్తామన్నారు. ల్యాండ్ కమిషన్ వేస్తాం.

Update: 2024-08-08 11:24 GMT

ఆర్వోఆర్ 2‌‌024 ముసాయిదా..

రెవెన్యూ కోర్టు Vs ట్రిబ్యునల్

– ఏది అవసరం?

– దేశంలో మరెక్కడైనా ఉందా?

– బీహార్ ట్రిబ్యునల్ ఎందుకు పెట్టారు?

– ఇక్కడ అప్పీల్ తోనే సరి పెట్టారు

– ఆర్వోఆర్ సమస్యలకు అవసరమా!

– చర్చనీయాంశంగా మారిన అంశమిదే

దిశ, తెలంగాణ బ్యూరో:

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ని తీసుకొస్తామన్నారు. ల్యాండ్ కమిషన్ వేస్తాం. ప్రభుత్వ భూములను పరిరక్షించి, పౌరుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తాం.. అని స్పష్టంగా ఉంది. మరి ఆర్వోఆర్ యాక్ట్ 2024లో ట్రిబ్యునల్ ప్రస్తావన ఎందుకు చేయలేదు? అప్పీల్ వ్యవస్థతోనే ఎందుకు సరిపెట్టారు? కేవలం రెవెన్యూ కోర్టులకే ఎందుకు పరిమితమయ్యారు? ఇప్పుడు దీనిపై పెద్ద చర్చ నడుస్తున్నది. అంటే మేనిఫెస్టోకి భిన్నంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముసాయిదాను పబ్లిక్ డొమెయిన్ లో పెట్టడంతో పెద్ద చర్చకు దారి తీసింది. అనేక సూచనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్వోఆర్ యాక్ట్ 2024 ముసాయిదాను రూపొంచడంలో కీలక పాత్ర పోషించిన భూ చట్టాల నిపుణులు కూడా ప్రజల నుంచి తాము ఇదే కోరుకున్నట్లు చెప్తున్నారు. అన్ని అంశాల్లో కంటే అప్పీల్, రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునల్ మధ్య భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే ట్రిబ్యునల్ ఏర్పాటు పట్ల ప్రభుత్వం వెనుకడుగు వేయలేదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కేవలం ఆర్వోఆర్ చట్టం వరకే పరిమితమయ్యారు. హక్కులు కల్పించే చట్టాల్లో చేర్పులు, మార్పులు వంటివేం తీసుకురాలేదు. ప్రస్తుతం రికార్డ్ ఆఫ్ రెవెన్యూలో మెరుగైన సేవలందించే చట్టం మాత్రమే కొత్తగా రాసుకున్న అంశాన్ని చాలా మంది గుర్తించడం లేదు. రికార్డుల సవరణలు, తప్పొప్పుల దిద్దుబాటు వంటి ఇష్యూస్ లో ట్రిబ్యునళ్ల అవసరం ఉండదన్న వాస్తవాన్ని గ్రహించడం లేదు.

దేశంలో ఎక్కడెక్కడ?

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఉన్నాయా? ఏదైనా ఆర్వోఆర్ చట్టంలో ఈ అంశాన్ని చేర్చారా? ఆ ట్రిబ్యునల్స్ లో ఎవరెవరు ఉన్నారు? ఇదే విషయంపై భూమి సునీల్ ని ‘దిశ’ ఆరా తీసింది. మెరుగైన 18 ఆర్వోఆర్ చట్టాల్లో ఎక్కడా ట్రిబ్యునల్ లేదు. పైగా రికార్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టానికి, రెవెన్యూ ట్రిబ్యునల్ కి సంబంధమే లేదు. ఇది కేవలం రికార్డులను తయారు చేసే వ్యవస్థ మాత్రమే. ఈ చట్టం ప్రకారం హక్కుల నిర్దారణ కాదు. రికార్డుల సవరణలో అధికారులు తప్పులు చేస్తే అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. అసైన్డ్, టెనెన్సీ, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్, ల్యాండ్ గ్రాబింగ్, అటవీ భూములపై వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు రెవెన్యూ కోర్టుల్లో పని జరగడం లేదని భావిస్తే, సమస్యల తీవ్రత అధికంగా ఉందని తలచితే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవచ్చు. దేశంలో బిహార్ లో మినహా మరెక్కడా రెవెన్యూ ట్రిబ్యునల్ లేదు. అక్కడ కూడా ఆర్వోఆర్ కి సంబంధించిన అంశాల ప్రాతిపదికన నడవడం లేదు. హక్కుల నిర్దారణ కోసమే. అందులోనూ రెవెన్యూ అధికారులే పని చేస్తున్నారు. పైగా ఆ ట్రిబ్యునల్ పెర్మినెంట్ గా నడుస్తున్నాయని సునీల్ తెలిపారు. ఇది అన్ని రోగాలకు జిందాతిలిస్మత్ మాదిరిగా పని చేయదు. ఇది కేవలం రికార్డ్ ఆఫ్ రెవెన్యూగా గుర్తించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. అన్నింటికీ ఇందులోనే పరిష్కారం వెతకొద్దన్నారు.

కేసీఆర్ జమానా ట్రిబ్యునళ్లు

తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 కింద ఏర్పడిన ప్రత్యేక ట్రిబ్యునళ్లు అప్పటి దాకా పెండిండులో ఉన్న కేసుల పరిష్కారానికి మాత్రమే ఏర్పాటైంది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,296 కేసులకు గాను రెండింటిని మాత్రమే పెండింగులో ఉంచారు. 16,294 కేసులను డిస్పోజ్ చేశారు. ఇందులో 1,851 కేసుల్లో మాత్రమే ఇరుపక్షాల వాదనలు విన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా తీర్పులు ఇచ్చారన్న అభియోగంపై హైకోర్టు పలు సూచనలు చేయడంతో మరోసారి వాదనలు విన్నది. అప్పటి ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను రద్దు చేసి తాత్కాలిక ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసింది. అది కూడా రెవెన్యూ అధికారులతోనే కావడం గమనార్హం. ఆ రెవెన్యూ ట్రిబ్యునళ్లలో చాలా వరకు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందేనంటూ జారీ చేసిన తీర్పులే అధికం. తమ వాదనలను వినాలంటూ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారితో రెవెన్యూ సిబ్బంది ఆ తీర్పును కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని కేసుల్లో ఇరుపక్షాల వాదనలు వినాలి. కానీ తమ తీర్పు నచ్చకపోతే వాదనలను వినిపించేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఐనా పరిష్కారం కంటే రిజెక్ట్ ఫైళ్లే ఎక్కువ. ఇక్కడ రెవెన్యూ ట్రిబ్యునళ్ల వల్ల కలిగిన ప్రయోజనం నామమాత్రమే.

‌‌‌‌నాల్గంచెల పరిష్కారం

కొత్త చట్టం ప్రకారం రికార్డుల సవరణకు నాలుగు అంచల వ్యవస్థ ఏర్పడుతుంది. తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్/కలెక్టర్, సీసీఎల్ఏ ఉంటారు. అప్పీల్ వ్యవస్థలోనూ ఇదే నడుస్తుంది. ఈ సమస్యల పరిష్కారానికి చట్టంలో నిర్దేశిత అధికారి(ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్) నిర్దేశిత కాలం వరకు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఒక్కో సమస్యను ఏ స్థాయిలో, ఏ అధికారి, ఎంత కాలంలో పరిష్కరించాలని అంశం చట్టంలో లేదు. ఇది మార్గదర్శకాల ద్వారానే వెల్లడవుతుంది. చట్టంలోనే అది పేర్కొనడం ద్వారా చేర్పులు, మార్పులకు వీలుండదు. దరఖాస్తులు, సమస్యల సంఖ్య తీవ్రమైనప్పుడల్లా మార్చుకునే వెసులుబాటు కలిగిచేందుకు చట్టంలో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అని పరిమితం చేశారు. అప్పీల్ వ్యవస్థ ద్వారా దాదాపు న్యాయం పొందే వీలుంటుంది. ఆ తర్వాతే కోర్టుకు వెళ్లొచ్చు.

ప్రతి శనివారం పని చేయాలి

గతంలో కోనేరు రంగారావు సిఫారసుల ప్రకారం రెవెన్యూ కోర్టులు నడిచేవి. ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ స్థాయిలో కోర్టులు ఉండేవి. ఇప్పుడవి పకడ్బందీగా పని చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నడిపిస్తున్నారు. అలాగే ఆర్డీవో, అదనపు కలెక్టర్/కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతి శనివారం రెవెన్యూ కోర్టులు నడిచేలా వ్యవస్థను రూపొందించాలి. పని ఒత్తిడి ఎంత ఉన్నా భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్యులకు న్యాయం జరుగుతుందని పలువురు అడ్వకేట్లు సూచిస్తున్నారు. అలాగే దరఖాస్తుల పరిష్కారంలో 100కు తహశీల్దార్ కనీసం 80, ఆర్డీవో 50, కలెక్టర్ 20 శాతం తప్పనిసరి తనిఖీ చేయాలన్న నిబంధన కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల్లో ఉంది. దాని అమలుకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు జీవోలు కూడా తీసుకొచ్చారు. వాటిని ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా కింది స్థాయి అధికారులు తప్పు చేసే అవకాశం కాస్తయినా తగ్గుతుంది. రెవెన్యూ అధికారులు గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. చట్టంలో దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన గైడ్ లైన్స్ జారీ చేసేటప్పుడు సామాన్య రైతు కోణంలో ఆలోచించాలని పలువురు కోరుతున్నారు. 


Similar News