రేవంత్ సర్కార్ హామీల ఎగవేత ప్రభుత్వం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రేవంత్ రెడ్డి సర్కార్హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి సర్కార్హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం బీజేఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి స్కూల్, కాలేజ్ రోజుల్లో ఛాంపియన్ అనుకుంటా ఏకపాత్రాభినయంలో అసెంబ్లీలో ఏకబిగిన రెండు గంటల పాటు వివిధ అంశాలపై ఏకపాత్రాభినయాన్ని రక్తి కట్టించారని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో తాను లేవనెత్తిన అంశాలకు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారని, అందుకు ఆయన ప్రసంగాన్ని ఏకపాత్రాభినయం అని విమర్శించాల్సి వస్తోందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగవేతల ముఖ్యమంత్రిగా రికార్డు సాధిస్తున్న రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో మేము లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్నారని మండిపడ్డారు.
శాసనసభలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో ఆ గ్యారెంటీలకే చట్టబద్ధత లేకుండా పోయిందన్నారు. ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు తాము సిద్దమని, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉందన్నారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలి. రుణమాపీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ లో ఏ గ్రామానికి వెళ్లినా సరే రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా తాను సిద్దమని సవాల్విసిరారు. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్ మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నించారు.
లంకె బిందెల కోసమా, మీ ఆస్థాన గుత్తేదారుల ప్రాజెక్టులకు రీ ఎస్టిమేషన్ వేసి ఇస్తున్న మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా అంటూ మండిపడ్డారు. మూసీ నదీ ప్రక్షాళన ప్రాజెక్టు అంచనా వ్యయం కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్లకు ఎలా పెరిగింది, ఎందుకు పెరిగిందో, దీని వెనకున్న మతలబేంటో అసలింతకీ ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఉందో లేదో ముఖ్యమంత్రే స్పష్టత ఇవ్వాలని డిమాండ్చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసిఆర్ కుటుంబానికి కాళేశ్వరం, మిషన్ భగీరధ ప్రాజెక్టులు ఎలా అయితే కామధేనువుగా ఉన్నాయో ఇపుడు సిఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఏటిఎంగా మలుచుకునేందుకు ప్లాన్ గీశారని, కేసిఆర్ హాయంలో వేల కోట్లు అవినీతి జరిగినట్టే ఇపుడు రేవంత్ సర్కార్ కూడా వేల కోట్ల అవినీతి కోసం మూసీ ప్రాజక్టు, ఫోర్త్ సిటీ ప్రాజెక్టులను చేపట్టినట్టుగా ఉందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేసులేవీ..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ నేతలెవరినీ అరెస్టు చేయలేదు. ఒక్క ఫోన్ ట్యాపింగులో తప్ప మరో దానిపై కేసు కూడా నమోదు కాలేదు. బీఆర్ఎస్ నేతల అవినీతిని కక్కిస్తామన్న రేవంత్ రెడ్డి ఇపుడెందుకు కాలయాపన చేస్తున్నారు. తెరవెనక ఏదో మంత్రాంగం నడుస్తోందనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అనుమానం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీహారీ ఐఏఎస్ లు దోచుకుంటున్నారని ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆరోపించిన రేవంత్ రెడ్డి, ఇపుడు సిఎం అయ్యాక గతంలో తాను ప్రస్తావించిన అవినీతి అధికారుల భరతం ఎందుకు పట్టడం లేదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కీలక శాఖలను పర్యవేక్షించిన ఐదారుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారని, వారిపై కేసులు పెట్టకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వారిని బ్లాక్ మెయిలింగ్ చేసి, సెటిల్మెంట్ చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. అంటే రేవంత్ రెడ్డి డాన్ లకే డాన్ గా మారినట్టు అనిపిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, మిషన్ భగీరధ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి భారీ అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులను సిబిఐ విచారణకు ఇవ్వకుండా సర్కారు వాటిని నీరుగార్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది. ఈ స్కాముల్లో దోషులెవరనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ తేల్చుతుందని, పరిస్దితి చూస్తుంటే బీఆర్ఎస్ నేతల నుంచి కమిషన్లు తీసుకుని ఈ కేసులన్నింటిని నీరు గార్చా…