ప్రత్యేక అధికారులూ..కనిపించరేమి...

సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.

Update: 2024-10-06 09:46 GMT

దిశ, నందిగామ : సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. కానీ గ్రామ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రత్యేక అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవరిస్తున్నారు. వారానికి ఒకసారి కూడా గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదు. దాంతో పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించింది. ఈగలు, దోమలు వ్యాపించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో తత్కాలికంగా పల్లెలకు ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని వీరిని నియమించారు.

    కానీ చాలా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు గ్రామ సభల సమయంలో మాత్రమే కనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయినా, వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలకు అంతరాయం కలిగినా వీరు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించి దోమలకు నిలయంగా మారడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు కూడా వెలగడం లేదని, మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు గ్రామాల్లోకి వెళ్లి సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.  

Tags:    

Similar News