పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలు,లబ్ధిదారుల ఎంపిక : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రతి పేదవారికి సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత

Update: 2024-10-18 11:58 GMT

దిశ,పటాన్ చెరు : ప్రతి పేదవారికి సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించిందని, పూర్తి పారదర్శకంగా కమిటీలు, లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం విధివిధానాలపై ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగా గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ కమిటీలు, వార్డ్ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. ఈ పథకం కింద ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సొంతంగా ఖాళీగా జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా నిరుపేదలకు జాగా లేకుంటే.. అధికారుల పరిశీలన తర్వాత వారి ఖాళీ స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవకతవకలు జరగడానికి వీలు లేదని ఆదేశించారు. త్వరలోనే ప్రభుత్వం లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.


Similar News