ప్రధాని నరేంద్ర మోడి మహిళల కళ్ళల్లో కారం కొడుతున్నాడు : మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంటగ్యాసు సిలిండర్ ధరలను 500 రూపాయలు దాటనివ్వమని మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచందు రెడ్డి అన్నారు.

Update: 2023-03-02 10:32 GMT

దిశ, తలకొండపల్లి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంటగ్యాసు సిలిండర్ ధరలను 500 రూపాయలు దాటనివ్వమని మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచందు రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపూర్, దేవుని పడకల్, పడకల్ గ్రామాలలో హాథ్ సే హాథ్ జోడోయాత్ర ప్రారంభోత్సవానికి వంశీ చందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జోడోయాత్రను ఘనంగా ప్రారంభించారు.

అనంతరం పడకల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు డోకూరి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి కార్యకర్తల కేరింతలు, బాణా సంచాలు కాలుస్తూ ఘనంగా నిర్వహించారు. గ్రామాలలోని ప్రధాన వీధులన్నీ తిరుగుతూ జోడోయాత్ర ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఏఐసీసీ కార్యదర్శి రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాడని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

దేశంలో నరేంద్ర మోడీ ప్రతినిత్యం ధరలు పెంచి ఆయన దోస్త్ అయినా ఆదానిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చేశాడని వంశీచందర్ రెడ్డి ఎద్దేవ చేశాడు. భారతదేశంలోని పెట్రోల్ డీజిల్ ధరలనే పెంచడం కాకుండా, మహిళలు ప్రతినిత్యం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను నరేంద్ర మోడీ నేటి నుండి మరో 50 రూపాయలు పెంచారు. వ్యాపారవేత్తలు హోటల్లు, ఫంక్షన్లలో వినియోగించే సిలిండర్ ధరలు మాత్రం మరో 350 రూపాయలు పెంచారని అసహనం వ్యక్తం చేశారు.

మోడీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీఇచ్చి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుందని, ఈ 8 సంవత్సరాల కాలంలో 16 కోట్ల ఉద్యోగాలను చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వంశీ సూటిగా ప్రశ్నించారు. దేశంలోని మధ్యతరగతి కుటుంబాల జీవన స్థితిగతులు కోలుకోలేని విధంగా బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచి ఆదాని అంబానీ లాంటి వారికి మాత్రం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా చేశారని సూచించారు.

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 4 లక్షల కోట్ల అప్పులు చేసి కాంట్రాక్టర్ల పేర్ల పైన కమిషన్ తీసుకొని వారి కుటుంబంలోని కవిత, కేటీఆర్ ను, హరీష్ రావును బలోపేతం చేశాడని ఎద్దేవ చేశారు. కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి హామీలన్నీ తుంగలో తొక్కాడని, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, రైతుల రుణమాఫీ, పింఛన్ల మంజూరు లాంటి ఎన్నో పథకాలకు తూట్లు పొడిచారని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారుల్లోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వంశీ చందర్ రెడ్డి ప్రజలు ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోలేదని, కేసీఆర్ మరో నాటకం ఆడడానికి తెరలేపి బీఆర్ఎస్ గా అవతరించి దేశాన్ని మరోసారి దోచుకోవడానికి భారీ స్కెచ్ వేశాడని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అంజయ్య, దేవుని పడకల్ సర్పంచ్ శ్రీశైలం, కడ్తాల్ ప్రెసిడెంట్ యాట నరసింహ, నాయకులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, దశరథం, అజీమ్, శ్రీశైలం, జనార్దన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, హరీష్, రమేష్, రవీందర్ యాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News