MLA Kasireddy Narayana Reddy : సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
దిశ, ఆమనగల్లు : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్ పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, వెల్డండ మండలాల ద్వారా కొట్ర గేట్ కు చేరుకుంటారన్నారు. ఆదివారం ఉత్తమ పార్లమెంటేరియన్,మాజీ కేంద్రమంత్రి దివంగత జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గం కొట్ర గేట్ దగ్గరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ చేరుకుంటారని, అనంతరం జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని అన్నారు. అనంతరం కల్వకుర్తి పట్టణంలో బహిరంగ సభ ఉంటుందని, ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి సుమారు 20 వేల జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ విజయవంతానికి నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ, మండల అధ్యక్షులు జగన్, మున్సిపాలిటీ అధ్యక్షులు మానయ్య, నాయకులు బాబా, విజయ్, అలీం, నాసర్ పాల్గొన్నారు.