2 లక్షల మంది రూ.2వేల కోట్లు.. పాత బకాయిలు ఉంటే రుణాలు ఇవ్వని బ్యాంకులు

మాఫీ కోసం 2 లక్షల మంది రైతుల ఎదురుచూపు

Update: 2024-10-19 03:15 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి అనుకూలంగా మూడు విడుతల్లో రుణమాఫీ చేసింది. అయితే రూ.2లక్షల్లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో రూ.2 లక్షల రుణమాఫీ కానీ వారు సుమారుగా 2 లక్షల మంది రైతులకు రూ.2 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి కే కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పాత రుణాలు మాఫీ కాక పోతే కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సీజన్ పూర్తయినప్పటికీ రుణాలు మాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు రుణ మాఫీ చేయకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.

ఆశలతో ఎదురుచూపు..?

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో 3 లక్షల 50వేల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ మూడు విడుతల్లో రుణాలు మాఫీ చేసేందుకు ముందుగానే లబ్ధిదారులను గుర్తించింది. మొదటి విడుత రూ.లక్ష, రెండో విడుత రూ.1.50 లక్షలు, మూడో విడుతగా రూ.2లక్షల చొప్పున మాఫీ చేసింది. అయితే మొదటి, రెండో విడుతల్లో జరిగిన రుణామాఫీలో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేశారు. మూడో విడుత రుణమాఫీలో రూ.2 లక్షలు అయ్యేందుకు అనేక సమస్యలు కనిపిస్తున్నా యి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో ఇంకా 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. రూ.2లక్షల రుణాలు తీసుకున్న వాళ్లు 2లక్షల మందికి రూ.2వేల కోట్లు మాఫీ కావాలని అధికారులు వివరిస్తున్నారు.

అప్పులు తెచ్చి చెల్లింపు..

రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు ఒకే కుటుంబంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. అందుకు అనుగుణంగా రైతులు రూ.2లక్షలకు పైన ఉన్న రుణాలను బ్యాంకుల్లో చెల్లించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా రైతులు అప్పోసప్పో చేసి రూ.2 లక్షలకుపైన ఉన్న నగదును బ్యాంకుల్లో చెల్లించారు. అయినప్పటికీ రుణ మాఫీ విషయంలో సమస్య అలాగే కొనసాగుతుంది. కొంత మంది రైతులు రూ.2లక్షలకు పైగా రుణాలు వేర్వేరు బ్యాంకుల్లో తీసుకున్నా రు. మరికొంత మంది ప్రాథమిక సహకార బ్యాంకు ద్వారా తీసుకున్నా రు. అయితే రుణాలు తీసుకునేటప్పుడు ఆధార్​, రేషన్​ కార్డు, ఇంటిపేరు అడ్రస్ ​ వివరాలు ఆన్​లైన్​లో తప్పుగా ఎంటర్​ చేసినట్లు తెలుస్తోంది. దాంతోనే రుణాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. మరి కొంత మంది రైతులు అన్ని విధాలా నిబంధనలకు లోబడి ఉన్నప్పటికీ రూ.2 లక్షలు రుణం మాఫీ కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతుల ఆందోళనకు చెక్​ పెట్టాలని కోరుతున్నారు.

ఇంకా 2193 మందికి రుణమాఫీ కాలేదు..

రూ.2లక్షల రుణమాఫీకి 5103 మంది అర్హులు. ఇందులో 2910 మంది రైతులకు రెండు లక్షల చొప్పున రూ.22.36కోట్లు మాఫీ అయ్యింది. మిగిలిన 2193 మంది రైతుల రుణమాఫీ పెండింగ్‌లో​ ఉంది. ఇందులో 39 మంది రైతులు మరణించారు. అయితే పెండింగ్​లో ఉన్న రైతుల ఆధార్​ నంబర్లు వేర్వేరుగా ఉండడంతో జాప్యం జరుగుతున్నది.

-విద్యాధరి, మండల వ్యవసాయాధికారి, ఇబ్రహీంపట్నం

ఆన్​లైన్​లో వివరాలు తప్పుగా నమోదు చేశారు..

పంట రుణం రెండు బ్యాంకుల్లో తీసుకున్నా. ఎస్​బీఐలో రూ.75 వేలు, మంగల్​పల్లి సొసైటీ బ్యాంక్​లో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1,25,000 తీసుకున్నా. అయితే రెండో దఫాలోనే రుణమాఫీ కావాలి. కానీ, ఇప్పటి వరకు కాలేదు. ఎందుకని వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే ఆధార్​ నంబర్ రెండు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీంతో రుణమాఫీ అయ్యేందుకు జాప్యం జరుగుతుందని అధికారు లు వివరించారు. ఏ బ్యాంకులైతే ఆధార్​ నంబర్​ తప్పుగా పడిందో అక్కడ సరిచేసుకోవాలని తెలిపారు. కానీ ఆ బ్యాంకు వాళ్లు మా చేతిలో ఏమీ ఉండదు.. అంతా వ్యవసాయాధికారి కార్యాలయంలో అంటూ తిప్పుతున్నారు. రుణమాఫీ అవుతుందో? లేదో అనే అనుమానం ఉంది.

- జమ్మ బీరప్ప, ఆదిభట్ల రైతు

Tags:    

Similar News