కేటీఆర్ రాజీనామాకు ఒత్తిడి.. నైతిక బాధ్యత వహించాలని డిమాండ్లు

బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది.

Update: 2024-06-07 02:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు వరుస పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా పార్టీ ఓడిపోతున్నా కనీసం రివ్యూలు లేవని, ఇకపై కూడా ఇలానే ఉంటామంటే భవిష్యత్‌లో మరింత నష్టం వాటిల్లుతుందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కేటీఆర్ రాజీనామా చెయ్..

గులాబీ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అన్నీ ఎదురుదెబ్బలే.పదేళ్లు రాష్ట్రాన్ని విజయవంతంగా పరిపాలించిన అనుభవం పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క అభ్యర్థిని కూడా గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది. గతంలో ఆ పార్టీ చేసిన తప్పిదాలే ఇప్పుడు వెంటాడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో జీరో(0) సీట్లు రావడానికి కారణమని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు.ఎన్నికల ప్రచారం అంతా తానే చూసుకున్నారు. అయినప్పటికీ ఎంపీ సీట్లు రాకపోగా.. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత తీసుకుని తన పదవికి రాజీనామా చేయాలని గులాబీ కేడర్ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు.

దురుసు ప్రవర్తన వల్లే..

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ బాస్ తన కొడకు కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. సీఎంగా తాను అందుబాటులో లేకుంటే పార్టీ వ్యవహారాలు,నిర్ణయాలు కేటీఆర్ తీసుకుంటారని ప్లీనరీలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే, కేటీఆర్ తన కోటరీకి తప్పా ఎవరికీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సీనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను పెద్దగా పట్టించుకునే వారు కాదని కేడర్ గతం నుంచే ప్రధానంగా ఆరోపిస్తూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేటీఆర్ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఒప్పుకోవడంతో పాటు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం, దురుసు తనంతో పార్టీకి మరింత నష్టం కలిగించారని ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ.

వరుసగా ఓటమి.. అయినా నో రివ్యూ..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీలో ఏం జరుగుతుందో ఇప్పటివరకు కేటీఆర్ సమీక్షలు చేయలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేడర్ ప్రధాన తప్పిదంగా ఎత్తి చూపిస్తోంది. పార్టీ సీనియర్లు, కీలక నేతలు,కార్యకర్తలకు మధ్య గ్యాప్ కూడా ఓటమికి ప్రధానంగా కారణంగా తెలుస్తోంది. అసెంబ్లీలో ఓటమి తర్వాత కేడర్ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కీలక నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. మిగిలిన వారిపై అధికార పార్టీ కేసులు పెట్టడంతో పాటు గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్, ఫోన్ ట్యాపింగ్ కూడా పార్టీ ప్రతిష్టను ఘోరంగా దెబ్బతీశాయి.

ఇప్పటికైనా పార్టీ ఓటములపై రివ్యూలు నిర్వహిస్తే లోటుపాట్లు తెలుస్తాయని పార్టీని గాడిలో పెట్టే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.కానీ, ఆ దిశగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా, పార్టీ కోసం నిజాయితీగా, నమ్మకంగా పనిచేసేవారిని పక్కకు పెట్టారని.. చెంచాగాళ్లు, చాడీలు చెప్పేవాళ్లను పక్కన పెట్టుకోవడంతో పార్టీకి మరింత నష్టం చేసిందని పార్టీ కేడర్ అదిష్టానంపై మండిపడుతోంది. ఉద్యమకారులను గుర్తించకపోవడం, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే కార్యకర్తలకు, పార్టీ ఎంపిక చేసిన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులకు మధ్య గ్యాప్ పెరిగిందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పుడైనా పార్టీ పెద్దల తీరు మారాలని, లేదంటే పార్టీకి, తమకు భవిష్యత్ ఉండబోదని కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తెగ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుని వేరే వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.


Similar News