పారిస్ ఒలంపిక్స్లో సత్తా చాటాలి: మంత్రి జూపల్లి
అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో ఒలంపిక్ రన్ ను ఉత్సాహంగా నిర్వహించారు.
దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో ఒలంపిక్ రన్ ను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్రీడా జ్యోతిని వెలిగించి పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు మంత్రి జూపల్లి.. ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పారిస్ ఒలింపిక్స్లో భారతదేశ క్రీడాకారులు తమ సత్తా చాటి దేశ కీర్తి ప్రతిష్టలను పెంచాలని, తెలంగాణ నుంచి బరిలోకి దిగుతున్న ప్లేయర్లు కూడా పతకాలు సాధించాలని అకాంక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్లో రాణించిన క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ మహేశ్గౌడ్, రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ కోశాధికారి మహేశ్వర్, ఉపాధ్యక్షుడు ప్రేమ్రాజ్, బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు.