చేనేత రంగం అభివృద్ధికి శాశ్వత పథకాలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

చేనేత కళకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ప్రభుత్వం శాశ్వత పథకాలు చేపట్టనుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Update: 2024-08-07 16:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చేనేత కళకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ప్రభుత్వం శాశ్వత పథకాలు చేపట్టనుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చేనేత జౌళీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సాంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల అంకితభావం, సృజనాత్మకత దేశానికి గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ధరించి నేతన్నకు చేయూతనివ్వాలని అన్నారు. నేతన్నలకు మేలైన జీవితాన్ని ఇంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచానికి పోటీపడే పద్ధతులు నేర్చుకొని నేత ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 2024-25 బడ్జెట్ లో 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చుటకు 90 కోట్లు కేటాయించామని తెలిపారు. నేతన్న భీమా ద్వారా రాష్ట్రంలో 36777 మంది చేనేత కార్మికులు మరియు అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూర్చుటకు ఈ ఆర్థిక సంవత్సరానికి 15 కోట్లు కేటాయించామన్నారు . తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నెలకొల్పడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నేతన్న భీమా పథకం కింద ఇప్పటివరకు124 డెత్ క్లెయిమ్స్ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున 6.20 కోట్లు వారి నామినీ ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. అనంతరం శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుల కింద 32 మందికి నేత డిజైనర్ లకు ప్రతిభ పత్రము, జ్ఞాపిక శాలువాతోపాటు ఒక్కొక్కరికి రూ. 25 వేల నగదు పురస్కారం అందించారు. చేనేత వస్త్రాల వినియోగం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తామన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ విజయ రెడ్డి, మాజీ డీఐజీ తేజ్ దీప్ కౌర్, రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు కందకట్ల స్వామి, మండల శ్రీరాములు, సత్యనారాయణ, మురళి, అరుణ్ కుమార్, వరలక్ష్మి, దుష్యంత్, ఆప్కో మాజీ చైర్మన్లు, పద్మశాలి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News