ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్కు ఆప్షన్లు షురూ..
ఇప్పటివరకూ సీటు పొందని వారు ఎవరైనా ఉంటే ఆగస్టు 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటివరకూ సీటు పొందని వారు ఎవరైనా ఉంటే ఆగస్టు 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి గురువారం నుండి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. దీని ద్వారా కన్వినర్ సీటు పొందడానికి విద్యార్ధులకు ఇదే చివరి అవకాశం కావడంతో ప్రత్యేక కౌన్సెలింగ్కు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు 19 వరకూ ఆప్షన్లు ఎంచుకొనే అవకాశం కల్పించారు. వీరికి ఆగస్టు 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రత్యేక కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్ధులు రెండు రోజుల్లోగా సీటు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్లను ఆగస్టు 25న స్పాట్ అడ్మిషన్ల పేరిట భర్తీ చేయనున్నారు. ఐతే ఈ ప్రక్రియ ఆన్లైన్లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం త్వరలో విడుదల చేయనుంది.
కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంసెట్ కౌన్సెలింగ్లో దాదాపు 19,049 సీట్లు మిగిలిపోయాయి. వీటిల్లో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్సీ బ్రాంచ్లోనే 3,034 సీట్లు మిగిలి పోయాయి. సివిల్ ఇంజనీరింగ్లో 2505 సీట్లు, ఈసీఈలో 2721 సీట్లు, ఈఈఈలో 2630 సీట్లు, ఐటీలో 1785 సీట్లు, మెకానికల్లో 2,542 సీట్లు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రత్యేక కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు.
కంప్యూటర్ సైన్స్లో అదనంగా 7,000 సీట్లు..
మరోవైపు ఈ ఏడాది 2023-24 విద్యాసంవత్సరానికి గానూ పలు కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లను పెద్ద సంఖ్యలో రద్దు చేసుకున్నాయి. ఆ సీట్ల స్థానంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచులకు సంబంధించిన సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు అదనంగా మరో 7,000 సీట్లు కొత్తగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో కంప్యూటర్ సైన్స్ సీట్లు దాదాపు 14 వేల వరకు పెరిగాయి. కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు, పేరులేని మాములు కాలేజీల్లో చేరడానికి ఇష్టపడటం లేదు. ఇక మెయిన్ సిటీలయిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో దాదాపు 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు విద్యార్ధులు ప్రవేశాలు పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న174 కాలేజీల్లో 83,766 కన్వినర్ కోటా సీట్లు, 33 వేలు యాజమాన్య కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి.