Harish Rao : ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే.. ప్రభుత్వానికి హరీష్ రావు కీలక సూచనలు

పడకేసిన పల్లె వైద్యం, మంచమెక్కిన మన్యం, సీజనల్ వ్యాధులతో జనం విలవిల, ఊరంతా విషజ్వరాలే.. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Update: 2024-08-29 07:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పడకేసిన పల్లె వైద్యం, మంచమెక్కిన మన్యం, సీజనల్ వ్యాధులతో జనం విలవిల, ఊరంతా విషజ్వరాలే.. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయన్నారు. మలేరియా, డెంగీ వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు.

జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థమన్నారు. పాలన గాడి తప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నరని తెలిపారు. ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్‌తో వణికిపోతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇదంతా చూసీ చూడనట్లు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ, విష జ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలని కోరారు. విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గురువారం ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.


Similar News