పోలీస్ స్టేషన్ లో యువకుడి వీరంగం.. ఏఎస్సైని బూతులు తిడుతూ హంగామా

Update: 2024-08-11 06:27 GMT

దిశ, గాంధారి: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే నానా హంగామా చేశాడు. పోలీసులను నానా తిప్పలు పెట్టాడు. కోపంతో తనపై కేసు పెట్టిన వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. మండలంలోని కాటేవాడి తండాకు చెందిన బానోత్ రాజేష్ శుక్రవారం సాయంత్రం గాంధారి ఎంపీడీవో ఆఫీస్ సమీపం నుండి బైక్ పై అతివేగంగా వెళ్తున్నాడు. దాంతో వెనకాలే వస్తున్న పెద్ద గుజ్జుల్ గ్రామానికి చెందిన కన్నేరాం రాజేష్ ను ఆపి రోడ్డుపై స్లో గా వెళ్లాలని సూచించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజేష్ నాకే చెప్తావా అంటూ కన్నేరాం మీద దాడి చేసి కొట్టాడు. అతని బైక్ ను కూడా ధ్వంసం చేశాడు. దాంతో బాధితుడు కన్నేరాం గాంధారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలేదులు కేసు నమోదు చేసి నిందితుడు రాజేష్ ను స్టేషన్ కు పిలిపించారు. జరిగిన విషయంపై పోలీసులు రాజేష్ ను ప్రశ్నిస్తుండగానే తనపై ఫిర్యాదు చేసిన కన్నేరాం పై పోలీసుల సమక్షంలోనే చేయి చేసుకున్నాడు. అడ్డుకున్న ఏఎస్ ఐ గంగారాం ను కూడా బూతులు తిడుతూ స్టేషన్లోని టేబుల్ పై ఉన్న వస్తువులను చిందరవందరగా పడేసి హంగామా సృష్టించాడు. దీంతో రాజేష్ పై కేసు నమోదుచేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ ఐ ఆంజనేయులు తెలిపారు. రానున్న గణేష్ ఉత్సవాల్లో యువకులు మధ్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించినా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా చట్టపరంగా కఠిన శిక్షలుంటాయని ఎస్ ఐ ఆంజనేయులు హెచ్చరించారు. 

Tags:    

Similar News