విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం చెలగాటం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గూపన్‌పల్లిలో గల శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం నిర్వాకం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది.

Update: 2024-04-04 06:47 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: 2018 సంవత్సరం నుండి స్కూల్ భవన యజమానికి అగ్రిమెంట్ డబ్బులు, ఫర్నిచర్, అద్దె డబ్బులు కట్టడం లేదని సదరు యజమాని గురువారం ఉదయం పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశారు. దీంతో ప్రతి రోజు యధావిధిగా ఉదయం తమ పిల్లలతో కలిసి స్కూల్ దగ్గర దించడానికి వచ్చిన తల్లిదండ్రులకు తాలం వేసి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఎందుకు తాళం వేశారని స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు అడగడంతో ఈరోజు సెలవు గా ప్రకటించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మరోవైపు పరీక్షలు ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే విషయాన్ని తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థుల నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ అద్దె, పెండింగ్ అగ్రిమెంట్ డబ్బులు కట్టకపోవడం ఏంటని వారిని ప్రశ్నించారు. ఇప్పటివరకు తమకు స్కూల్ యాజమాన్యం 60 లక్షల వరకు డబ్బులు పెండింగ్‌లో పెట్టడం జరిగిందని యాజమాని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ..ప్రతి విద్యా సంవత్సరం ఇలాంటి సమస్యలే తీసుకొస్తున్న స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.


Similar News