Police : సినిమా స్టైల్ లో గంజాయిని పట్టుకున్న పోలీస్

హైవే పై ఉన్న నాలుగు రహదారులను తమ ఆధీనంలోకి తీసుకొని... ముందస్తుగా తమ వద్ద ఉన్న పక్కా సమాచారంతో సినిమాను తలపించే విధంగా రౌండ్ చేసి పోలీసులు గంజాయిని పట్టుకున్న సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది.

Update: 2024-07-30 15:57 GMT

దిశ భిక్కనూరు : హైవే పై ఉన్న నాలుగు రహదారులను తమ ఆధీనంలోకి తీసుకొని... ముందస్తుగా తమ వద్ద ఉన్న పక్కా సమాచారంతో సినిమాను తలపించే విధంగా రౌండ్ చేసి పోలీసులు గంజాయిని పట్టుకున్న సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పలానా స్థలంలో గంజాయిని విక్రయించనున్నా రన్న పక్కా సమాచారంతో భిక్కనూరు ఎస్ ఐ సాయికుమార్, రెండవ ఎస్ఐ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలోని పోలీసులు మఫ్టీలో అక్కడికి చేరుకున్నారు. నాలుగు రూట్లలో ఎవరికి అనుమానం కలగకుండా రోడ్లపై నిలబడి మాటువేశారు.

అదే సమయంలో అదిలాబాద్ జిల్లా బోత్ మండలం సొనాల గ్రామం గుట్ట పక్క తండాకు చెందిన సకార్వాల్ హర్ సింగ్ బైక్ పై వచ్చి, బీబీపేట మండల కేంద్రానికి చెందిన బూరే గారి రోహిత్ గౌడ్ ( హోటల్ వ్యాపారం ), బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన వడ్ల వంశీ ( కార్పెంటర్ వృత్తి తో పాటు డ్రైవర్ )లకు గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3375 రూపాయల విలువ గల 145 గ్రాముల గంజాయిని, రెండు బైకులను, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఇంచార్జ్ మేజిస్ట్రేట్ సుధాకర్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు.

గంజా రవాణా పై గట్టి నిఘా...

గంజా వ్యాపారం గుట్టుగా సాగుతుందన్న సమాచారం మేరకు, అనుమానితులపై గత కొంతకాలంగా భిక్కనూరు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఎక్కడి వారు సరఫరా చేస్తున్నారన్న సమాచారాన్ని, అనుమానితుల వివరాలు ముందే సేకరించిన పోలీసులు, గంజాయి విక్రయదారుల్ని పట్టుకునేందుకు సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజా ఇక్కడికి ఎలా రవాణా అవుతుందన్న పక్కా సమాచారాన్ని పోలీసులు సేకరించారు. రాత్రి పగలు అని తేడా లేకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేయడమే కాకుండా, అనుమానం వచ్చిన ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

ఆ పేర్లు సీక్రెట్ గా ఉంచుతాం...

గంజాయి రవాణా పై ఎవరైనా తమకు సమాచారం అందిస్తే, సమాచారం అందించిన వారి పేర్లు సీక్రెట్ గా ఉంచుతామని భిక్కనూరు ఎస్ ఐ సాయికుమార్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన "దిశ"తో మాట్లాడుతూ గంజాయి పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. నిషేధించిన గంజాయిని విక్రయిస్తే కటకటాలకు వెళ్లడం తప్పదని ఆయన హెచ్చరించారు. ఒక్క గంజానే కాకుండా, అక్రమ మద్యం, నిషేధిత గుట్కా వంటి వాటి రవాణాపై నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు.


Similar News