హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు
ఎన్నో అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురి చేసి గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్డౌన్ షురూ అయ్యిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్ : ఎన్నో అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురి చేసి గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్డౌన్ షురూ అయ్యిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ మార్చి ఏడో తేదీ వరకు నెరవేర్చాలని, లేదంటే వెంటాడుతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. గురువారం ఎమ్మెల్యేగా మూడవ సారి ఎన్నికైన తర్వాత మొదటి సారి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా వేల్పూర్ ఎక్స్రోడ్ వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తన తండ్రి దివంగత వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పూలమలతో నివాళి అర్పించి అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వేల్పూర్ బయలు దేరారు. అక్కడ ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాల పాటు సుధీర్ఘ పోరాటం చేసి తీసుకొచ్చిన పార్టీ తమది అన్నారు.
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారని తెలిపారు. డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అతికష్టంగా పండే తెలంగాణలో ఈరోజు మూడు కోట్ల మెట్రిక్ టన్నులు పండే స్థాయికి తీసుకొచ్చారని తెలిపారు. 24 గంటల కరెంటు ఇచ్చి చెరువులను గంగాళంలా మార్చి బోర్లలో నీళ్లు తెచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారాలు
చేసి ఒక్కసారి తమకు ఓటు వేయండని కాంగ్రెస్ నేతలు వేడుకుంటే జనాలు ఓటు వేశారని అన్నారు. రెండు శాతం తేడాతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది అని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాక ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందని, ఎవరు కుంగి పోవనవసరం లేదన్నారు. పదిహేను వేల రైతు బంధు అమలయ్యేలా వెంటపడాలని కోరారు. రెండు లక్షల రుణమాఫీకి రేపటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నారు. తొంభై రోజుల్లో అంటే మార్చి ఏడో తేదీ లోపల రెండు లక్షల రుణమాఫీ చేయాలని సూచించారు. మిగతా హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.