నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరుద్దాం.. ఎమ్మెల్యే

కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రం, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో అధికారులు నిబద్ధతగా చిత్తశుద్దితో పనిచేయాలని, తనవంతు పూర్తి సహకారం అందిస్తానని కామారెడ్డి శాసనసభ్యలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కోరారు.

Update: 2023-12-18 12:21 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రం, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో అధికారులు నిబద్ధతగా చిత్తశుద్దితో పనిచేయాలని, తనవంతు పూర్తి సహకారం అందిస్తానని కామారెడ్డి శాసనసభ్యలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి మాట్లాడుతూ కలెక్టరేట్ దేవాలయం, అధికారులు దేవుళ్ళ లాంటి వారని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించి ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా పనిచేయాలన్నారు. మనం ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించామని, ఆ కష్టాలను గుర్తెరిగి తన వల్ల ఎవరు నష్టపోరాదనే భావనతో భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలని, గతం తిరగేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్న ఆత్మసంతృప్తి కలగాలని హితవు పలికారు.

విధి నిర్వహణలో కొన్ని ఒత్తిడులు వచ్చినా నిబంధనల మేరకు పనిచేయాలని, ఒకరి పై నిందారోపణలు చేయరాదని, మన వ్యక్తిత్వం మంచిగా ఉండాలన్నారు. పరిపాలన శక్తివంతంగా ఉండాలని, విధినిర్వహణ మానవతా దృక్పథం, నిజాయితీ కలిగి ఉండాలని సూచించారు. తనకు వ్యవస్థ పై గౌరవం ఉందని, జనానికి ఉపయోగపడే సమస్యల గురించి మాత్రమే అధికారులను అడుగుతానని, అధికారులు కూడా అంతే నిజాయితీగా స్పందిస్తూ వాస్తవాలను తెలపాలని కోరారు. నియోజకవర్గానికి సంబంధించిన ఏ విషయమైనా సానుకూల దృక్పథంతో తననుకలవచ్చని, లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పలుశాఖల ద్వారా అమలు పరుస్తున్న కార్యక్రమాలు, ప్రగతిలో ఉన్నపనులు, వివరాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. త్వరలో శాఖల వారీగా విడివిడిగా సమీక్షిస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లా అధికారులు మంచి సమర్ధులని, తమ శాఖల ద్వారా కేటాయించిన లక్ష్య సాధనలో బాగా కృషి చేస్తున్నారన్నారు. పనుల నిర్వహణలో ప్రజాప్రతినిధులకు సమాచారమందిస్తూ వారి సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు పూర్తి సహకారమందిస్తారన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ, మెప్మా, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, నీటిపారుదల, విద్యుత్, వైద్యం, విద్య, సంక్షేమ శాఖలు, ఆర్ అండ్ బీ, పౌరసరఫరాలు, మున్సిపాలిటీ, అటవీ, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయం, పశుసంవర్ధకం, సెరికల్చర్, ఆర్టీసీ అగ్నిమాపకం, తదితర శాఖల ద్వారా అమలు పరుస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రగతిని శాసనసభ్యులకు వివరించారు.

ఈ ఖరీఫ్ లో 4 కోట్ల 43 లక్షల ధాన్యం సేకరించామన్నారు. 5500 మంది వీధి వ్యాపారులకు మూడు దఫాలుగా 10 వేలు, 20 వేలు, 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచామని కలెక్టర్ వివరించారు. మహాలక్ష్మి పథకం పట్ల మహిళల నుంచి అపూర్వస్పందన లభిస్తున్నదని, ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతున్నాయని అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో బహిరంగ ప్రదేశాలు ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. కామారెడ్డి పట్టణంలో రెండు రైల్వే వంతెనలు, 10 బ్రిడ్జిల నిర్మాణ ఆవశ్యకత కలదని వివరించారు. ఈ సందర్భంగా అధికారులు శాశనసభ్యలను పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. అంతకుముందు శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి దంపతులు సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, డివిజనల్ స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News