పరిశుభ్రత పాటించడం తో రోగాల బారి నుంచి రక్షించుకోవచ్చు : కలెక్టర్

పరిశుభ్రత పాటించడం వల్ల రోగాల బారి నుంచి రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

Update: 2024-06-20 11:00 GMT

దిశ, కామారెడ్డి : పరిశుభ్రత పాటించడం వల్ల రోగాల బారి నుంచి రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. 14వ జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ముదాంగల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు ఆల్బెండజోల్ మాత్రలు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కడుపులో నట్టలు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి వంటి వాటితో బాధపడతారని అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి, జూన్ మాసాలలో రెండు పర్యాయాలు ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తున్నదని అన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కడుపులో పురుగులు నట్టలు నశిస్తాయని, అనీమియాను నియంత్రించవచ్చని, పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారని అన్నారు.

జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు 2,50,254 పిల్లలున్నారని గుర్తించడం జరిగిందని, వారికి వంద శాతం మాత్రలు అందించేలా కార్యాచరణ రూపొందించి నేడు మాత్రలు అందిస్తున్నామని, ఏదేని కారణం చేత ఈ రోజు మాత్రలు వేసుకొని వారికి తిరిగి ఈ నెల 20 న ఆల్బెండజోల్ మాత్రలు వేయించి వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర, రెండు నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు ఒక మాత్రను నలిపి ఇవ్వాలని , 3 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు చప్పరించేలా వేయించాలని అధికారులకు సూచించారు. అన్ని అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మాత్రలు వేయాలని అన్నారు.

ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సైతం ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు వేయించాలని, ఎట్టి పరిస్థితులలో మాత్రలు ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించే ఆల్బెండజోల్ మాత్రలు చాలా శ్రేష్ఠమైనవని, ఎలాంటి సైడ్ ఎఫెక్టులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ మాత్ర పనిచేస్తుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠాశాలల కింద చేపట్టిన టాయిలెట్ బ్లాక్స్, మంచినీటి ట్యాంక్, కుళాయిలు, తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు, కిటికీల మరమ్మత్తులు పనుల ప్రగతిని పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, మహిళా సమాఖ్య సభ్యురాలిని వివరాలడిగి తెలుసుకున్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతూ ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తున్నామని, ఒక్క రూపాయి ఖర్చులేకుండా శిక్షితులైన అధ్యాపకులచే బోధన గావిస్తున్నామని, విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ. శుభ్రత పాటించకుండా చేతులు నోట్లో పెట్టు కోవడం, గోళ్లు గిల్లుకోవడం, పాదరక్షలు లేకుండా మట్టిలో ఆడుకోవడం వల్ల కడుపులో పురుగులు పడే అవకాశం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.

ఈ పాఠశాల పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని తమ వంతు సహకారమందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వనిత, వార్డు కౌన్సిలర్, ప్రముఖ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్, డీఈఓ రాజు, ఎంఈఓ ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News