కాలనీలో భారీ చోరీ.. ఇంటికి తాళం వేసి వెళితే దారుణం..

Update: 2024-09-03 04:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః నిజామాబాద్ నగరంలోని ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగరంలోని బ్యాంక్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కుటుంబం మూడు రోజుల క్రితం పనుల నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లింది. సోమవారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులకు వేసిన తాళం పగల గొట్టి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి, బీరువాలో దాచి ఉంచిన కొంత నగదు, బంగారం, వెండి అపహరణకు గురైనట్లు గమనించారు. బాధితుడు శ్రీనివాస్ ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ నగరంలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత అవసరాలకు, ఫంక్షన్లకు, బంధుమిత్రులను కలవడానికి ఇంటికి తాళం వేసి ఇతర గ్రామాలకు వెళ్లాలంటేనే నగర ప్రజలు దడుచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను ఎంతగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న దొంగతనాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Similar News