నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. తెరుచుకోనున్న గేట్లు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత

Update: 2024-09-04 08:53 GMT

దిశ,నిజాంసాగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 18,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి ఈఈ సోలోమాన్ తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు గాను ప్రస్తుతం 1403.21 అడుగుల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 15.268 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో నుండి హల్ది వాగు, పోచారం ప్రాజెక్టు నుండి పొంగి ప్రవహిస్తున్న నీరు ఉధృతంగా వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి చేరుతుంది. మరో కొద్ది గంటలలో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంటుందని ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువ మంజీర నదిలోకి వదలనున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, గొర్ల కాపరులు, ఎవరు కూడా మంజీరా నది పర్యాయ ప్రాంతంలో, నీటి ప్రవాహంలోకి, కాలువలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం సాయంత్రంలోగా నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను తెరవనున్న సందర్భంగా బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ,రూరల్ సీఐ సత్యనారాయణ స్థానిక నీటిపారుదల శాఖ ఈ ఈ సోలో మాన్ తో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాజెక్టు పైకి వచ్చే పర్యాటకులకు ఉధృతంగా ప్రవహించే నీళ్ల వద్దకు వెళ్లి సెల్ఫీలకు కానీ వీడియోలు గాని తీయరాదని ఆయన అన్నారు. ఎస్సై సుధాకర్ కు సూచించారు. ప్రాజెక్టు గేట్లు వదులుతున్న సందర్భంగా దిగువన మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Similar News