ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు.. మొద్దు నిద్రలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. అన్నట్లుగా నాయకులు తలుచుకుంటే ప్రభుత్వ భూముల్లో నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలించొచ్చు.

Update: 2024-10-08 02:40 GMT

దిశ, కామారెడ్డి: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. అన్నట్లుగా నాయకులు తలుచుకుంటే ప్రభుత్వ భూముల్లో నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలించొచ్చు. మమ్మల్ని అడిగేది ఎవరు.. అన్నట్లుగా సాగుతోంది మట్టి దోపిడీ వ్యవహారం. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులోని‌గూడెం రోడ్డు పక్కన గల అసైన్డ్ భూమి సర్వే నంబర్ 38‌లో నుంచి సుమారు సంవత్సర కాలంగా యథేచ్ఛగా మొరం తరలిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా కొందరు అక్రమార్కులు తవ్వకాలు చేపడుతూ.. అక్రమ రవాణాకు తెర తీశారు. ప్రభుత్వ భూములు అమ్మొద్దు, కొనకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి సర్వే నెం.38లోని ప్రభుత్వ భూమిని సదరు నాయకుడు రెండు ఎకరాలు కొనుగోలు చేసి అందులో నుంచి గత సంవత్సర కాలంగా టిప్పర్లతో మట్టి, మొరం తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

అధిక లోడ్ టిప్పర్ల‌తో మొరం తరలించడం వల్ల గ్రామంలో వేసిన రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి తరలింపు, భూమి కొనుగోలు, రోడ్ల ధ్వంసం విషయాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సహకారంతోనే సదరు వ్యక్తి యథేచ్ఛగా మొరం తరలిస్తున్నాడని ఆరోపించారు. ఈ అక్రమ మట్టి రవాణాపై ఎవరూ దృష్టి సారించకపోవడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని అన్నారు. జేసీబీ, హిటాచి సహాయంలో మట్టిని తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని అన్నారు. అనుమతులు లేకుండానే అక్రమ తవ్వకాలతో రూ.లక్షల ఖనిజ సంపద తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.

మట్టిని తవ్వుతున్న వాహనాలు సీజ్ చేస్తాం

శాబ్దిపూర్ శివారులోని సర్వే నెం.38లో గల అసైన్డ్ భూమిలో నుంచి అక్రమంగా మట్టి, మొరం రవాణాను ఊపేక్షించం. మొరం తవ్వుతున్న జేసీబీ, హిటాచి‌తో పాటు తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేస్తాం. వెంటనే ఆర్ఐని పంపించి వాహనాలను సీజ్ చేసి తీసుకురమ్మని చెప్పాం.

- నరేందర్ తహసీల్దార్, కామారెడ్డి


Similar News