బీఆర్ఎస్ రెండుసార్లు అధికారం చేపట్టినా రైతులకు మిగిలింది శూన్యం
ఎవరి చేతిలో కట్టె ఉంటే వారిదే గేదె అన్నట్టు గత ప్రభుత్వ పాలన కొనసాగిందని అసెంబ్లీ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రతిపక్ష నాయకులకు తనదైన రీతిలో చురకలు అంటించారు.
దిశ, తాడ్వాయి : ఎవరి చేతిలో కట్టె ఉంటే వారిదే గేదె అన్నట్టు గత ప్రభుత్వ పాలన కొనసాగిందని అసెంబ్లీ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రతిపక్ష నాయకులకు తనదైన రీతిలో చురకలు అంటించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కనీసం ఉండడానికి గూడు లేకుండా ప్రజలు పాములు, తేళ్లతో సాహసం చేస్తున్నారంటూ అసెంబ్లీ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తనదైన రీతిలో ప్రస్థావించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడే సందర్భంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉందని సభకు వినిపించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని రెండుసార్లు పర్యటించి లక్ష ఎకరాలకు ప్యాకేజీ 22 కింద నిరందిస్తానని అన్న కేసీఆర్ తట్టేడు మట్టికూడా పని జరగలేదని అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించాడు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రధానంగా మట్టిని నమ్ముకుని వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి సరిపడా నీళ్లు అందించాల్సిందిగా సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సమస్యలపై ఇదివరకు ఎన్నికైన ఏ ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించలేదని, అలాంటిది ఎమ్మెల్యే మదన్మోహన్ రైతులు నిరుద్యోగులకు సమస్యలను అసెంబ్లీలో వెల్లడించినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.