చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించే సత్తా కాంగ్రెస్ కు లేదు

ఫ్యాక్టరీలను తెరిపించే సత్తా కాంగ్రెస్​కు లేదని, బీజేపీయే తెరిపిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

Update: 2024-04-05 12:01 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ఫ్యాక్టరీలను తెరిపించే సత్తా కాంగ్రెస్​కు లేదని, బీజేపీయే తెరిపిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాలకు సంబంధించిన నిజాం, సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీలని తెరిపించే సత్తా వారికి లేదని, తామే ఆ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోను విడుదల చేసిందని, అందులో స్వామినాథం కమిటీ సిఫార్సుల మేరకు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని పొందుపరిచారని తెలిపారు. దేశంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసిందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాకే రైతులకు మేలు జరిగింది అని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ కోసం కమిషన్ వేస్తుందట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అన్నారని ఆయన గుర్తు చేశారు.

    అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నెలలోపు పంటల బీమా పథకం ద్వారా పదివేల రూపాయలు అందిస్తామని నమ్మబాలికారని తెలిపారు. అంతేకాకుండా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎగుమతి దిగు దిగుమతులను ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారని, కానీ దేశంలో ఏళ్ల తరబడి ఈ విధానం కొనసాగుతుందని, ఇది కాంగ్రెస్ నాయకులకు తెలియనిది కాదన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తే ప్రధాని మోడీ ఎందుకు గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. దేశంలో రైతులను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకు అందించలేదని అన్నారు. రైతులకు రైతు భరోసా కింద నిధులు ఇవ్వరు కానీ కాంగ్రెస్ మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు బిల్లులు చెల్లిస్తారని ఆయన దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, బోనస్ 500 రూపాయలు ఇస్తామని అన్నారని, అది ఎక్కడ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు.

     రైతులకు రుణమాఫీ చేయరని, ఎందుకంటే ప్రభుత్వం వద్ద పైసలు లేవన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​కు, ఇచ్చిన హామీలకు పొంతన లేదన్నారు. రైతులకు పంట నష్టం కింద 10వేలు ఇస్తామని హామీ ఇచ్చరని, అది ఇవ్వనందున ఎకరానికి 25వేలు పంట నష్టం అందించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డును తీసుకువచ్చిన ఘనత తనదేనన్నారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత అహంకారానికి వెళ్లి జైలు పాలైందని, సోనియా గాంధీ సైతం అవినీతి పరురాలని, అందుకే దేశంలో ఓటమిని చవిచూస్తుందని అన్నారు. అంతేకాకుండా అవినీతిని, టెర్రరిస్టులను పెంచి పోషిస్తుందని అన్నారు. తాను లోకల్ ప్రాంతానికి చెందిన వాడినేనని అన్నారు.

     ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజాంబాద్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి హిందూ సమాజం అంటే గిట్టదన్నారు. వారు రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, న్యాలం రాజు, మోహన్ రెడ్డి, ఎర్రం సుధీర్, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.


Similar News