భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

Update: 2024-08-31 12:58 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ శనివారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్, ఆర్టీసీ, ఇరిగేషన్, వైద్యారోగ్యం తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాగల 48 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, వాగులు, కుంటల్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా చెరువులకు గండ్లు పడకుండా నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ తదనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

     పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా కార్యస్థానాల్లో ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చూడాలన్నారు. ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సమాచారం అందించేలా సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో సమర్థవంతంగా పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల వద్ద బస్సులు జాగ్రత్తగా నడిపేలా ఆర్టీసీ డ్రైవర్లను అప్రమత్తం చేయాలని ఆర్ఎంకు సూచించారు. అవసరమైతే వరద ప్రవాహం ఏర్పడే ప్రాంతాల మీదుగా వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలని అన్నారు.

     పట్టణ ప్రాంతాలలో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ కూరుకుపోయి వర్షపు జలాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశాలు ఉన్నందున, ముందస్తుగానే వాటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్ తో పాటు ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లు 24 గంటల పాటు పనిచేసేలా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ఏదైనా సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. ఏ చిన్న నిర్లక్ష్యానికి సైతం తావివ్వకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

    ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం వచ్చి చేరే అవకాశం ఉన్నందున శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎవరు కూడా చేపల వేటకు ప్రాజెక్టులు, చెరువులు, నదులలోకి వెళ్లకుండా కట్టడి చేయాలని, ఆదివారం సెలవు దినమైనందున విద్యార్థులు, యువకులు ఈత సరదా కోసం చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా నిలువరించాలని సూచించారు. సెల్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ తరుణ్ కుమార్, సీపీఓ మల్లికార్జున్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News