కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు

బీఆర్ఎస్ నాయకులు అధికార కాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని రాష్ర్ట మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Update: 2024-03-21 12:43 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ఎస్ నాయకులు అధికార కాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని రాష్ర్ట మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం వలన నష్టపోయిన రైతులను , పంట పొలాలను జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వారు ఇంత గీ పెట్టినా పార్టీ ఖాళీ ఖావడం ఖాయం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గల్లంతు అవుతుందని, ఒక్క సీట్ కూడా గెల్సుడు గగనమే అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ మూతపడుతుందని, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు అని తెలిపారు.

    ఆకాల వర్షాల వలన పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు గురికావద్దు అన్నారు. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారని, పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నాం అని ఈ సందర్బంగా తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరువు వచ్చినా, వరదలు వచ్చినా, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా గత పదేళ్లలో ఏనాడు కూడా సాయం చేయలేదు అన్నారు. కనీసం పంట నష్టంపై నివేదికలు కూడా తెప్పించలేదు అని గుర్తు చేశారు. రైతు భరోసా పథకం ద్వారా 3.5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే రూ. 4295 కోట్లు నగదు బదిలీ చేశామన్నారు.

    69.86 లక్షల రైతులకు గాను 58.66 లక్షల మంది రైతులకు రైతు భరోసా నగదు బదిలీ చేశామని, మిగిలిన రైతులకు కూడా వారం రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో వేస్తాం అని తెలిపారు. ఓ పక్కన రైతు సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటూనే మరోవైపు మూడు నెలల స్వల్ప కాలంలోనే ఆరు గ్యారంటీలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, ఒకటో తారీకునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే

    నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అధిక వడ్డీ భారమైనా తెచ్చి హామీలను నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, చైర్మన్ కోపరేటీవ్ యూనియన్ కార్పొరేషన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.ఆర్. భూపతి రెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, బాన్స్వాడ ఇంఛార్జి రవీందర్ పాల్గొన్నారు. 


Similar News