అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి దారుణ హత్య

మండల కేంద్రంలోని ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.

Update: 2024-01-22 14:34 GMT

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలోని ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తాడ్వాయి గ్రామానికి చెందిన ముందాం శంకర్(45) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లగా సోమవారం గ్రామ శివారులో రోడ్డు పక్కన రక్తపు మరకలతో బైక్ శరీరం పై పడి మరణించి కనిపించాడు. అటువైపుగా వెళ్లిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న

    ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై ఆంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా భావించారు. వెంటనే డాగ్స్ స్క్వాడ్ ను రప్పించగా రక్తపు మరకలను గమనిస్తూ వెళ్లగా బ్రహ్మాజీవాడి శివారులోని ఓ వ్యవసాయ భూమిలో మద్యం బాటిళ్లతో బండరాళ్లతో తలకు తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్లు గుర్తించారు. దుండగులు అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా సృష్టించేందుకు సోమవారం గ్రామ శివారులోని రోడ్డు పక్కన మృతదేహాన్ని వదిలి వేసినట్లు విచారణలో తేలిందన్నారు. మృతుడి ఫోన్ డాటా ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఓ కుమార్తె కలదు. మృతుని భార్య ముదాం లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. 


Similar News