Narayana: అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బహిష్కరించిన సీపీఐ నేత!

అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని, ప్రొ.సాయిబాబా మరణానికి నిరసనగా నేటి కార్యక్రమానికి హాజరు కాలేనని సీపీఐ నేత నారాయణ అన్నారు.

Update: 2024-10-13 07:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని, ప్రొ.సాయిబాబా మరణానికి నిరసనగా నేటి కార్యక్రమానికి హాజరు కాలేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణాలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. లేఖలో.. నా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మీరు నన్ను ఆహ్వానిస్తున్న మీ "అలయ్ బలయ్" కార్యక్రమానికి నేను హాజరు కాలేనందుకు క్షమించాలని కోరుతూ.. ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ప్రముఖ మేధావి అన్న విషయం అందిరికీ తెలుసని, ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అయిన ఆయన్ను 90 శాతం ఆర్థోపెడికల్ ఛాలెంజ్‌తో ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం అరెస్టు చేసిందని తెలిపారు.

విచారణలో హక్కు అయిన బెయిల్ ను కూడా కోర్టు తిరస్కరించిందని, దర్యాప్తు సంస్థలు సాయిబాబాను అక్రమంగా 10 ఏళ్ల పాటు నిర్భందించిన తర్వాత గౌరవ న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా నిర్ధారించిందని గుర్తుచేశారు. ఇక నేను, నా పార్టీ ప్రొఫెసర్ సాయిబాబా రాజకీయాలను అంగీకరించకపోవచ్చు, కానీ ఆయన విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని వ్యాఖ్యానించారు. సాయిబాబా దర్యాప్తు సంస్థలు, కోర్టుల వల్లే.. రాష్ట్రమే కాదు చివరికి ఈ ప్రపంచం నుండి దూరం అయిపోయాడు అనడంలో సందేహం లేదన్నారు. బండారు దత్తాత్రేయను ఉద్దేశిస్తూ.. మీరు పెద్దమనిషి కానీ మీరు అతని మరణానికి దారితీసిన అదే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దీనికి నిరసనగా మీరు నిర్వహించే ఈ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని నారాయణ స్పష్టం చేశారు.


Similar News