భయపెడుతున్న “బంధం” నడవాలంటేనే వణుకుతున్న జనం

వివిధ అవసరాల నిమిత్తం స్వగ్రామం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా...?

Update: 2024-10-13 14:31 GMT

దిశ,తుంగతుర్తి: వివిధ అవసరాల నిమిత్తం స్వగ్రామం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా...? అయితే తోడుగా మరో ఇద్దరినో,ముగ్గురినో తీసుకెళ్లండి...! ఎందుకంటే ఒకరికొకరు బలంగా తోడై బలంగా నడిస్తేనే వాగుని దాటవచ్చు...అది కూడా గ్యారెంటీగా ఉంటుందని చెప్పలేము...ఒకవేళ ఎవరి తోడు లేకుండా వెళితే మాత్రం మీ ప్రాణాలకే ముప్పు వాటిల్ల వచ్చు..అంతేకాదు మళ్లీ ఇంటి ముఖం చూస్తారనే గ్యారెంటీ లేదు.. ఇది తుంగతుర్తి మండలంలోని కేశవాపురం-వెలుగుపల్లి గ్రామస్తుల వ్యధ.

వెలుగుపల్లి-కేశవాపురం గ్రామాల మధ్య ఉన్న చిత్తలూరి బంధం అక్కడి ప్రజలకు దిన దిన గండంగా మారింది. బంధం నుంచి నడిచే వారిని భయకింపుతులను చేస్తోంది. ఇప్పటికే ఆ బంధంలో జారిపడి పదుల సంఖ్యలో గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. ముఖ్యంగా కేశవపురం గ్రామ పరిధిలో ఉన్న బోడబండ,రాజన్న తండ,కేశవాపురం ప్రాంతాలకు చెందిన ప్రజలంతా పక్కనే ఉన్న వెలుగుపల్లితో పాటు మండల కేంద్రమైన తుంగతుర్తికి రావాలంటే.. మధ్యలో ఉన్న చిత్తలూరి బంధం దాటాలి. అంతే కాదు వెలుగుపల్లి ప్రాంతానికి రైతుల పొలాలు బంధానికి ఆవల (అంటే కేశవాపురం వైపు),కేశవాపురం ప్రాంతానికి చెందిన రైతుల పొలాలు బంధం ఈవల (అంటే వెలుగుపల్లి వైపు) ఉంటాయి. వీటిని సాగు చేసుకోవడంతో.. పాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చి పోవాల్సి ఉంటుంది. అయితే బంధం మీదుగా గత కొన్ని రోజులుగా ఎస్సారెస్పీ రెండో దశ జలాలు ఫీటున్నర ఎత్తులో పొంగి పొర్లుతూ జారుడుగా మారింది. ఫలితంగా వారం రోజుల వ్యవధిలోనే ఎంతో మంది ఇందులో జారిపడి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. కాగా కేంద్రమైన తుంగతుర్తిలో జరిగే సంతలో కూరగాయలు కొనుగోలు చేసి స్వగ్రామమైన కేశవాపురంకు వెళుతున్న క్రమంలో తూము ఎల్లయ్య అందులో జారిపడగా చేయి విరగడమే కాకుండా..తీవ్ర గాయాల పాలయ్యారు. అలాగే గ్రామస్తులైన కుటుంబరావు,వెంకన్నతో పాటు మరో ఏడేనిమిది మంది వివిధ స్థాయిల్లో గాయపడ్డారు.

నాడు వరదలు...నేడు ఎస్సారెస్పీ జలాలు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు వెలుగుపల్లి-కేశవాపురం గ్రామాల మధ్యనున్న చిత్తలూరి బంధాన్ని ప్రమాదకరంగా ముంచేశాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా అధికారులు కొద్దిరోజుల పాటు ఈ రహదారిని అధికారులు పలు చర్యలతో మూసేశారు. అనంతరం కాలక్రమేణ బంధం మీదుగా వరద కొంత తగ్గుముఖం పట్టిన తరుణంలోనే శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాల ప్రవాహం మొదలైంది. దీంతో ప్రజలకు ప్రయాణం సంకటంగా మారింది.

బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు

వెలుగుపల్లి-కేశవాపురం గ్రామాల మధ్య ప్రతి ఏడాది వివిధ సందర్భాల పరంగా.. కురిసే వర్షాలతో పొంగుతున్న చిత్తలూరి బంధంపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఓ వైపు..కేశవాపురం,బోరబండ,రాజన్న తండ మరోవైపు.. వెలుగుపల్లి గ్రామ ప్రజల నుంచి అనాదిగా వస్తుంది. చివరికి దీనిపై గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో సర్వేలు చేయించి.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ నెలలు గడుస్తున్న కొద్ది ఆ ఫైల్ కు మోక్షం కలగడం లేదు


Similar News