వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత

చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామంలో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Update: 2024-09-15 15:13 GMT

దిశ, చింతపల్లి : చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామంలో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి పలువురికి గాయాలయ్యాయి. అయినా ఒక వర్గం వారిపైనే కేసులు నమోదు చేశారని వింజమూరు గ్రామానికి చెందిన మహిళలు ఆదివారం మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీ రాత్రి ఓ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పలువురు దళితులను అదే గ్రామానికి చెందిన కొంతమంది కులం పేరుతో దూషించారు. మీరు మా బజారుకు ఎలా వస్తారని అవమానించడంతో ఆ వర్గానికి చెందిన యువకులు నిలదీశారు. దీంతో తమని ప్రశ్నిస్తారా? అని అగ్రకులాల వారు కర్రలతో దళిత యువకులపై దాడి చేశారు. మొత్తం 17 మందిపై కేసు నమోదు చేసి అక్రమంగా జైలుకు పంపారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

    పోలీసులు గ్రామంలో ఎలాంటి విచారణ చేపట్టకుండా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా వింజమూరు గ్రామానికి చెందిన నూనె సంతోష, పందుల తిరుపతమ్మ పై పలువురు వ్యక్తులు బీరు సీసాలతో, కర్రలతో దాడి చేసి చంపుతామని వెంబడించి బూతులు తిట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. దళితులను కులం పేరుతో అవమానించి, మహిళలపై దాడి చేసిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని తెలిపారు. వింజమూరు గ్రామానికి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ గ్రామ యువకులను హింసిస్తున్నాడని అన్నారు. అకారణంగా కులం పేరుతో దూషించి మహిళలపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి, మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. 

Tags:    

Similar News