ఏళ్లుగా నిర్లక్ష్యం.. మరమ్మతులకు ఏది దారి..?
కనగల్లు మండలంలోని ధర్వేశిపురం స్టేజి వద్ద నుంచి చర్లగౌరారం రహదారి ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతుంది.
దిశ, కనగల్లు: కనగల్లు మండలంలోని ధర్వేశిపురం స్టేజి వద్ద నుంచి చర్లగౌరారం రహదారి ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ మార్గంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు వందల మంది నిత్యం ప్రయాణం సాగుతున్నప్పటికీ రహదారి మరమ్మత్తులకు మోక్షం లభించడం లేదు. సుమారు 4 కిలోమీటర్ల మేర గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను వెంటనే పూడ్చకపోవడంతో ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వర్షం నీటితో గుంతలు నిండి దగ్గరకు వచ్చేవరకు ఈ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. తక్షణమే అధికారులు ప్రజల ఇబ్బందులను గుర్తించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని, అధికారులు, పాలకులు స్పందించి సత్వరమే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.