నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 20 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది.

Update: 2024-10-21 07:28 GMT

దిశ,నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. తాజాగా సాగర్‌కు వరద ప్రవాహం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం 6 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 1,25,641 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 211.4250 టీఎంసీల నిల్వ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,698 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

జలాశయం ఆరు క్రస్టుగేట్ల ద్వారా 1,67,898 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. అలాగే, సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 589.8 అడుగులకు చేరింది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు గాను ప్రస్తుతం 311.45 టీఎంసీలకు నీరు నిల్వ ఉంది. దీంతో సాగర్‌ 20 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 1,89,312 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2,30,348 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 2,30,348 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సాగర్‌ నుంచి పులిచింతలకు 1.71 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 173.72 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను 43.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది.


Similar News