నా 25 ఏండ్ల కోరిక నెరవేరింది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ మంత్రి కార్యాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల నుండి పలు ఫిర్యాదులను తీసుకొని తక్షణమే పరిష్కారించారు.

Update: 2024-08-29 15:40 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ మంత్రి కార్యాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల నుండి పలు ఫిర్యాదులను తీసుకొని తక్షణమే పరిష్కారించారు. ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వారి యొక్క సమస్యల మీద వినతులు ఇవ్వడానికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బొట్టుగూడాలో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిక్ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు యూనివర్సిటీ, జూనియర్ కళాశాలను నిర్మించినా కూడా, ఈ పాఠశాల నిర్మాణంతోనే నా 25 ఏండ్ల కోరిక నెరవేరిందని తెలిపారు. ఈ పాఠశాలను కార్పొరేట్ కు ధీటుగా కట్టిస్తున్నానని దాన్ని విద్యార్దులు వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే నేడు కలెక్టర్లు ఉన్నారని, ప్రైవేట్ స్కూల్ లో ఎంత మంచి టీచర్లు ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాల టీచర్ల కన్నా ఎక్కువేం కాదన్నారు. ఈ సంవత్సరం విద్య శాఖకు 22 వేల కోట్లు రూపాయలు బడ్జెట్ పెట్టామని, స్కిల్ యూనివర్సిటీ కూడా కడుతున్నామన్నారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ సారి 10వ తరగతిలో 10 జిపిఏ వచ్చిన వారికి 50 వేలు, 9.5జిపిఏ వచ్చిన వారికి 25 వేలు రూపాయలు ఇస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Similar News