‘పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు’

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్ అన్నారు.

Update: 2024-06-24 13:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జగిత్యాల బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడం అనైతిక చర్య అన్నారు. వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ సంజయ్‌ను రాజకీయాలకు పరిచయం చేసింది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్సా? రేవంత్ కాంగ్రెస్సా? అని నిలదీశారు. ఓ పార్టీ నుంచి ఎన్నికైన వారు మరో పార్టీలోకి వెళితే తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ పెడితే ఇక్కడ రేవంత్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలతో ముందుకు వెళ్తోందని ఆరోపించారు. డాక్టర్ సంజయ్ చేసింది నీతి హేయమైన చర్య అని, జగిత్యాలలో ఆయనపై అంతటా నిరసన వ్యక్తం అవుతోందన్నారు. రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, సిరిసిల్లలో ఆరుగురు, ఖమ్మంలో ఇద్దరు, కరీంనగర్‌లో ఒక్కరు చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలకే పరిమితమైందని చేతలు శూన్యం అన్నారు. అసెంబ్లీ లో నేత కార్మికుల అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. తక్షణమే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News