రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లేఖ.. సీఎంకు కీలక రిక్వెస్ట్..!

భద్రాచలం విలీన గ్రామ పంచాయితీలపై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ రాశారు.

Update: 2024-07-02 16:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాచలం విలీన గ్రామ పంచాయితీలపై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఆరో తేదీన భేటీ నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకుల పాడు గ్రామ పంచాయితీలను భద్రాచలంలో కలపాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం పట్టణం మినహా, ఏడు మండలాలు మిగతా గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయని తెలిపారు. భద్రాచలం పట్టణం శివారు నుంచి ఏపీలో విలీనమవ్వడంతో డంపింగ్ యార్డుకు స్థలం లేదని తెలిపారు. భద్రాచలం నుంచి చర్ల ప్రధాన రహదారిలో ఎటపాక ఆంధ్రాలో కలవడంతో అంతరాష్ట్ర సరిహద్దు సమస్యలు ఏర్పడే అవకాశముందన్నారు.

భద్రాచలం నుంచి చర్ల వెళ్ళేవారు ప్రధాన రహదారిపై ప్రయాణంలో విలీన గ్రామాల వల్ల ఏపీ మీదుగా రాకపోకల్లో సాంకేతిక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. భద్రాచలం రామాలయం దేవస్థానం భూములు పురుషోత్తమ పట్నం గ్రామంలో ఉండటంతో భూములపై ఆలయ అధికారులు పర్యవేక్షణ కు పాలనాపరమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భద్రాచలం అనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయితీల వారు తెలంగాణలో కలపాలంటూ పంచాయితీ తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. ప్రజా విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకొని భౌగోళిక పరమైన విభజనతో ఇబ్బందులు పడుతున్న ఐదు గ్రామ పంచాయితీలను ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం ప్రజా సంక్షేమం కోసం భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని సీఎంకు రాసిన లేఖలో మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. 

Similar News