మీ పాలనలో మ‌హిళా భ‌ద్రత‌ ఎక్కడుంది? : కేటీఆర్ వ్యాఖ్యల‌పై సీత‌క్క ఫైర్

అధికారంలో ఉన్నప్పుడు మ‌హిళా భ‌ద్రత‌ను గాలికొదిలేసి ఇప్పుడు గాలి మాట‌లు చెప్పడం మానుకోవాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మ‌హిళా శిశు సంక్షేమ మంత్రి సీత‌క్క హిత‌వు ప‌లికారు.

Update: 2024-08-19 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారంలో ఉన్నప్పుడు మ‌హిళా భ‌ద్రత‌ను గాలికొదిలేసి ఇప్పుడు గాలి మాట‌లు చెప్పడం మానుకోవాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మ‌హిళా శిశు సంక్షేమ మంత్రి సీత‌క్క హిత‌వు ప‌లికారు. తమరి హ‌యంలో మ‌హిళా భ‌ద్రత అంత ల‌క్షణంగా ఉంటే మ‌హిళ‌ల‌పై ల‌క్షన్నర‌కు పైగా నేరాలెందుకు జ‌రిగాయ‌ని ప్రశ్నించారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతుంటే మంత్రి సీత‌క్క ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న కేటీఆర్ వ్యాఖ్యల‌పై మంత్రి సీత‌క్క సోమవారం ఘాటుగా స్పందించారు. రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ ను నిందించడం కేటీఆర్ కే చెల్లిందని ఎద్దెవ చేశారు. పండగపూట రాజకీయ లబ్ధికోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారన్న సీత‌క్క.. మహిళా భద్రతకి త‌మ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంద‌ని గుర్తు చేశారు. నేరాలకు కారణం అవుతున్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల క‌ట్టడి కోసం త‌మ ప్రభుత్వం చేప‌ట్టిన చ‌ర్యలు కేటీఆర్ కు క‌నిపించ‌డం లేదా అని ప్రశ్నించారు. అదికారంలోకి వ‌చ్చి 8 నెలల తర్వాత మహిళలపై అఘాయిత్యాలు త‌మ‌కు గుర్తుకు వచ్చాయని కేటీఆర్ చెప్పడం ఆయన అజ్ఞానానికి అద్దం పడుతుందన్నారు. మహిళలపై ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా స‌త్వర‌మే త‌మ ప్రభుత్వం స్పందించిందని, గంటల వ్యవధిలోని నిందితులను అరెస్టు చేసామ‌ని గుర్తు చేశారు. లైంగిక దాడుల కేసుల్లో ఇప్పటికే 24 మంది దోషులకు శిక్షలు పడేలా చేశామ‌న్నారు. దోషుల‌కు 20 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్షలు ప‌డేలా వ్యవ‌హ‌రించామ‌ని చెప్పారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే, ఏలాంటి జాప్యం లేకుండా మంత్రులు, ఎంఎల్ఏలు, అధికారులు, కార్పొరేషన్ చైర్మన్ లలో ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున వెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలిచారని మంత్రి సీత‌క్క చెప్పుకొచ్చారు. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానే ఎన్నో సంద‌ర్భాల్లో బాధితుల‌ను ప‌రామార్శించిన‌ట్లు చెప్పారు. ఇక బీఆర్ఎస్ హాయంలో మహిళలపై లక్షన్నరకు పైగా నేరాలు జరిగితే, ఎన్ని కేసుల్లో త‌మ‌రు బాధితులను పరమార్శించార‌ని మంత్రీ సీత‌క్క ప్రశ్నించారు. మహిళలపై దాడులు జరిగితే బయటికి రాకుండా తొక్కి పట్టిన చరిత్ర బీఆర్ఎస్ ద‌న్నారు. విచ్చలవిడిగా పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్ వ్యాపారం జరిగినా నియంత్రించని అసమ‌ర్ధ పాల‌న కేటీఆర్ దని పేర్కొన్నారు. త‌మ‌రి హయాంలో మహిళల పై జరిగిన దాడులను ప్రస్తావిస్తే ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు. మహిళలను బ్రేక్ డాన్సర్లు, రికార్డింగ్ డాన్సర్లుతో పోల్చడం కేటీఆర్ చెప్పిన‌ట్లు చిన్న విషయం కానే కాద‌ని, కోట్ల మంది శ్రామిక, సామాన్య మహిళలని కించ పరచడమే అవుతుంద‌న్నారు. వ‌రుస ఎన్నిక‌ల్లో ప్రజ‌లు బుద్ధి చెప్పినా తమ దురంహకారం, దొరహంకారం పోలేద‌ని సీత‌క్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా భద్రత బీఆర్ఎస్ ప్రభుత్వంతో మొదలు కాలేదని, బీఆర్ఎస్ తోనే అంతం కాద‌ని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మహిళా పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన చ‌రిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిద‌న్నారు. మహిళా భద్రత కోసం పోలీస్ శాఖలో మహిళా సిబ్బందిని రిక్రూట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? బాధితులకు భరోసా కల్పించేందుకు మహిళా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మహిళా భద్రతకు కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన సబితా ఇంద్రారెడ్డిని కేటీఆర్ అడిగి తెలుసుకోవాల‌న్నారు. వరంగల్లో అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో అంద‌రికి తెలుసున‌ని, అప్పట్లో దటీజ్ వైయస్సార్ అని అంతా అభినందించిన‌ట్లు సీతక్క గుర్తు చేసారు. చ‌రిత్రలో మొట్ట మొద‌టి సారిగా ఒకేసారి 138 మంది మహిళా ఎస్ఐలను, 2400 మంది మహిళా పోలీస్ కానిస్టేబుల్ లను రిక్రూట్ చేసి శిక్షణ ఇస్తున్నామ‌న్నారు. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా ఇప్పటికైనా మహిళలను గౌరవించడం కేటీఆర్ నేర్చుకోవాలని మంత్రి సీత‌క్క సూచించారు.


Similar News