Minister Komatireddy: తెలంగాణ ప్రతిపక్ష నేత ఎవరో తెల్వదు
రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఎవరో తెల్వడం లేదని.. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చచ్చిపోయిందని, దాన్ని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఎవరో తెల్వడం లేదని.. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చచ్చిపోయిందని, దాన్ని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర యవనికపై బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని.. కేసీఆర్కు అర్థమైందని, అందుకే, ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొట్టడం అందులో భాగమేనని అన్నారు. అరెకపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి అందులో భాగమేనని అన్నారు.
కౌశిక్రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోడని.. ఆయన ఎమ్మెల్యే స్థాయి మెయింటైన్ చేయడం లేదని మండిపడ్డారు. ఆంధ్రా వాళ్ళను తిట్టడం బీఆర్ఎస్ పార్టీ విధానామా? అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. అసలు ఆంధ్రా వాళ్ల సపోర్టు లేకపోతే బీఆర్ఎస్కు అన్ని సీట్లు వచ్చేవా అంటూ నిలదీశారు. ఈ గొడవల వెనక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయడమే బీఆర్ఎస్ ఉద్దేశమంటూ ఆగ్రహించారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ ఉండేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ శ్రేణులందరూ సంయమనం పాటించాలని.. కానీ, సీఎం, నేతలపై మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయాలని సూచించారు. ఇష్టారీతిన మాట్లాడితే.. బీఆర్ఎస్ నేతలు రోడ్లపై తిరగకుండా చేయాలన్నారు.