Damodar Raja Narasimha : ఇకపై ఆసుపత్రుల్లో ఫుల్ సెక్యూరిటీ! మంత్రి కీలక ఆదేశాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

Update: 2024-09-02 12:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి సిబ్బందికి ముఖ్యంగా మహిళా డాక్టర్లు, మహిళ నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి రక్షణగా షీ టీం లతో రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేసేలా నిబంధనలు రూపొందించాలని ఆయన ఆదేశాలిచ్చారు. ఇవాళ సచివాలయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజీల్లో సెక్యూరిటీ బలోపేతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో శాశ్వతమైన అవుట్ పోస్టులు నిర్మించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రుల్లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించామన్నారు. రాష్ట్రంలో పది టీచింగ్ ఆస్పత్రిల్లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించడం జరిగిందన్నారు.

పీహెచ్‌సీల స్థాయి నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు

ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా పీఎస్ఏఆర్ (ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ - రెగ్యులేషన్స్) యాక్ట్ - 2015 ప్రకారం గుర్తింపు పొంది ఉండాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల ( పీహెచ్‌సీ స్థాయి నుంచి అన్ని ఏరియా హాస్పిటల్ల వరకు) ఆస్పత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లకు అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. భద్రతపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించాలని తెలిపారు. ఆస్పత్రి వైద్య శాఖ అధికారులు, స్థానిక పోలీసులు సమన్వయం చేసుకొని భద్రతను బలోపేతం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రుల్లో మహిళ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, సిబ్బంది భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై హాస్పిటల్ సేఫ్టీ కమిటీని నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రతి ఆసుపత్రిలో సెక్యూరిటీ హౌజ్

సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో హాస్పిటల్స్ సేఫ్టీ కమిటీ భద్రతాపరమైన నియమాలను రూపొందించాలని వెల్లడించారు. ఈ నెల సెప్టెంబర్ 14వ తేదీ లోపు రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. అలాగే, ఆస్పత్రి వైద్యులు నర్సులు భద్రతలో భాగంగా నమోదైన కేసులను యాక్ట్ 11 ఆఫ్ 2008 ప్రకారం రిజిస్టర్ చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి పది జిల్లాల ప్రతిపాదికన ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసుల విచారణ వేగవంతం అయ్యేలా కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హోం శాఖ, వైద్య ఆరోగ్యశాఖ విడివిడిగా సంయుక్తంగా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఆసుపత్రిలో సెక్యూరిటీ హౌజ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షను రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, రాష్ట్ర ప్రజారోగ్యం , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి , రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తదితర అధికారులు పాల్గొన్నారు.


Similar News