ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రజాసేవకులే: ఎంపీ ఈటల

ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఎవరైనా

Update: 2024-09-24 13:40 GMT

దిశ,మేడ్చల్ టౌన్: ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రజాసేవకులేనని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళల కృషి చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మున్సిపల్ సమావేశ మందిరంలో మంగళవారం మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి అధ్యక్షతన మేడ్చల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఆరు నెలలకు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో జరగవలసిన పనుల నిమిత్తం నిధులను కేటాయించి కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. మొదటిసారిగా మేడ్చల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్ విచ్చేయడంతో మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కమిషనర్ నాగిరెడ్డి కౌన్సిలర్లు శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు కౌన్సిల్ సభ్యులు పట్టణంలో నెలకొన్న సమస్యలను ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ పూడూరు గ్రామాన్ని మేడ్చల్ మున్సిపల్ లో విలీనం చేయడం తో తాను కూడా ఇప్పుడు మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ అని అన్నారు. ప్రభుత్వం హైడ్రాతో ప్రజలను ఇబ్బందులను గురి చేయడం పక్కనపెట్టి మురుగునీరు చెరువు లోకి రాకుండా మళ్లించేందుకు దృష్టి సారించాలని పేర్కొన్నారు. గతంలో చెరువులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని కానీ డ్రైనేజ్ నీటిని చెరువుల్లోకి వదులుతుండడంతో మురికి కూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో గ్రామాలలో అయితే సర్పంచులకు వాడు సభ్యులకు మున్సిపల్ లో అయితే కౌన్సిలర్లకు చైర్మన్ లకు ప్రజా సమస్యలు తెలుస్తాయని అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో మున్సిపల్ లో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కాంట్రాక్టర్లు నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేసిన వాటికి నిధులు మంజూరు కాకపోవడం తో అభివృద్ధి పనులను చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News