Revanth: బఫర్ జోన్‌లో ఇండ్లు ఉన్న వారికి పునరావాసం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

మంగళవారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అధికారులతో నిర్వహించారు.

Update: 2024-09-24 14:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంగళవారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఐఏఎస్ ఆమ్రపాళి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, దాన కిశోర్, ఎన్వీఎస్ రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఇందులో అధికారులతో చర్చించి సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మూసీ బాధిత ప్రజలకు అద్బుతమైన పునరావాస పథకం తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే బఫర్ జోన్ లో నివసించే కట్టడాలకు RFCTLARR చట్టం ప్రకారం, భూమి పట్టాదారుకు, భూమి విలువను బట్టి పరిహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా బఫర్ జోన్‌లో ఇండ్లు ఉన్న ప్రజలకు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమీక్షలో భాగంగా ఏ ఒక్క సామాన్యుడికి కూడా అన్యాయం జరగొద్దని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు.. మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. ఇక ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా 16 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, దీనిపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 10,200 మంది ప్రజలు ఉంటున్నట్లు సర్వే ద్వారా గుర్తించిన ప్రభుత్వం.. వారందరికీ పునరావాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా రేపటి నుండి అధికారులు రంగంలోకి దిగి, మూసి పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వీరంతా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి.. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి, పునరావాసం కోసం ఇండ్లు నిర్మిస్తున్న విషయాల గురించి ప్రజలకు వివరించనున్నారు. అయితే మొదటి దశలో 1,600 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Similar News