కేసీఆర్ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు

దిశ,సంగారెడ్డి బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ కోసం న్యాయపరంగా దృష్టి పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అంక్షారెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు పోరుబాట పాదయాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా పార్టీ శ్రేణులు ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నర్సిరెడ్డి తో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్ రెడ్డి, భూమ్ రెడ్డి లతో ఇతర నాయకులతో సీఎం మాట్లాడారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను నాయకులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల్లో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని, వారిని అన్ని రకాల ఆదుకునేలా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా గజ్వేల్ సెగ్మెంట్ పరిదిలోని పెండింగ్ పనులకు నిధులను మంజూరు చేస్తానని నర్సారెడ్డికి హామీ ఇచ్చారు. నర్సారెడ్డి ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ పాదయాత్ర చేపట్టారు. ఈ విషయంపై నర్సారెడ్డిని ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. మీ పాదయాత్రతో పట్ల కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారని నర్సారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఆయన కరచాలనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శి సాజిద్ బేగ్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మాజీ జడ్పీటీసీ ప్రభుదాస్ గౌడ్, మాజీ ఎంపీపీలు లక్ష్మారెడ్డి, మోహన్, సలీం, ఆయా మండలాల బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, లింగారావు, రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, కిష్టా గౌడ్, నాయకులు వెంకట్ నర్సింహరెడ్డి, బెజుగామ శివారెడ్డి, అట్ల భాస్కర్ రెడ్డి, సారిక శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.