జలదిగ్బంధంలో వనదుర్గమ్మ..

వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి.

Update: 2024-09-01 10:30 GMT

దిశ, పాపన్నపేట : వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట నిండడంతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొర్లుతోంది. పటాన్ చెరువు సమీపంలోని నక్క వాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం పెరిగింది.

దీంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి 13,000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఆలయ సిబ్బంది, అర్చకులు, పోలీసు సిబ్బంది వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి తాత్కాలికంగా మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందని వారు తెలిపారు.




 



Similar News