MLA : తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

Update: 2024-09-20 12:45 GMT

దిశ గజ్వేల్ /కొండపాక: తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం గజ్వేల్ లో జిల్లా కార్యదర్శి మంద పవన్ అధ్యక్షతన నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని అన్నారు.అయితే ఆ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవగా బీజేపీ పార్టీ వక్రీకరిస్తుందని ఆరోపించారు. 4500 మంది కమ్యూనిస్టు అమరుల రక్తతర్పణం తో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగిందని, అయితే హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసినప్పటికీ సిపిఐ బలోపేతం కాకుండా నాటి నెహ్రూ, పటేల్ సేనలు ఇక్కడి కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించినట్లు చెప్పారు.

బ్రిటిష్ ముష్కరుల పాలన నుండి భారతదేశానికి ఆగస్టు 15, 1947 న స్వాతంత్య్రం వచ్చినప్పటి హైదరాబాద్ సంస్థాన నిజాం నవాబు తమ ఆధీనంలో పెట్టుకుని హైదరాబాద్ ప్రత్యేక దేశంగా పాలన సాగిస్తూ దొరలు, దేశముఖ్ లు, జమిందార్ లు, జాగీర్దార్లు, రజాకార్లతో తెలంగాణ ప్రజలను పన్నుల రూపంలో చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మాక్ధూమ్ మోహినోద్ధిన్, అనభేరి ప్రభాకర్ రావు తదితర కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. దున్నేవాడికే భూమి ఇవ్వాలని 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత సీపీఐ పార్టీదని, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 4500 మంది అమరుల ప్రాణత్యాగం తో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు.

కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తోపాటు కొన్ని పార్టీలు ఈ చరిత్రను వక్రీకరిస్తున్నాయని, హిందూ, ముస్లింల గొడవగా, వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో భారతదేశంలో హైదరాబాద్ ను విలీనం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తితో యువ కమ్యూనిస్టులు పాలక ప్రభుత్వాల విధానాలపై పోరాటాలు నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టిపోగా, ఎమ్మెల్యేలు రాజకీయ కాంక్షతో బజారున పడి తన్నుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. దేశంలో సీపీఐ పార్టీకి మరణం లేదని, మరి కొద్ది రోజుల్లోనే వందేళ్ళ సంబురాలు నిర్వహించుకోనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రావు, దయానంద రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, కిష్టపురం లక్ష్మణ్, అందే అశోక్, నాయకులు స్వర్గం రాజేశం, చింత శ్రీను, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, మూన్వర్ జాన్, పద్మ, రజిని, మమత, కొయ్యడ కొమురయ్య, మంద శ్రీను, రూపేష్, సుధాకర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు జేరిపోతుల జనార్దన్, సంగెం మధు,రామగళ్ల నరేష్, వేల్పుల ప్రసన్నకుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


Similar News