Minister : ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం...

మా ప్రాంతంలో స్కూళ్లు...కళాశాలలు కావాలని...మా పిల్లలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఏ నాయకుడు నన్ను అడగలేదని

Update: 2024-10-16 13:35 GMT

దిశ, అందోల్‌: మా ప్రాంతంలో స్కూళ్లు...కళాశాలలు కావాలని...మా పిల్లలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఏ నాయకుడు నన్ను అడగలేదని...మన ప్రాంత పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యనభ్యసించేందుకు అనుకూలంగా అందోలు నియోజకవర్గంలో విద్యాసంస్థలను నెలకొల్పానని రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌రాజనర్సింహ అన్నారు. బుధవారం పుల్కల్‌ మండలం బస్వాపూర్‌ శివారులో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణం పనులకు జహిరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్, టీజీఐఐసీ కార్పొ రేషన్‌ చైర్మన్‌ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో మండలానికొక రెసిన్షియల్‌ స్కూళ్లను, జేఎన్‌టీయూ కళాశాల, సాంకేతిక, వ్యవసాయ పాలిటెక్నిక్, పీజీ కళాశాల, గురుకులాలను తీసుకొచ్చానని, ఇవన్నీ నాకు ఏ నాయకుడు చెప్పలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం వైద్యశాఖ మంత్రిగా ఉన్న నేను అందోలు వద్ద నర్సింగ్‌ కళాశాలను, 150 పడకల ప్రభుత్వాసుపత్రిని, వట్‌పల్లిలో 30 పడకల ప్రభుత్వాసుపత్రి, పీహెచ్‌సీ కేంద్రాలను ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించానన్నారు.

ప్రజలు వైద్యం కోసం 15 నిమిషాల్లో సబ్‌ సెంటర్‌కు, 20 నిమిషాల్లో పీహెచ్‌సీలకు, 30 నిమిషాల్లో ఏరియా అసుపత్రికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, సకాలంలో వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని, కానీ ఇక్కడి విద్యార్థులు ఇక్కడే ఉన్నత విద్యాభ్యాసం పొందేలా అవసరమైన అన్ని రకాల కళాశాలలు, పాఠశాలలు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ శెట్కర్‌ మాట్లాడుతూ… విద్యారంగ అభివృద్ధి కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్‌ స్థాయి మోడల్‌ పాఠశాలలలను గురుకుల పాఠశాలలుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. గతంలో తమ హయాంలోనే 161 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేసినట్లు తెలిపారు.

రూ.125 కోట్లతో ఇంటిగ్రేటేడ్‌ స్కూల్‌

రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రామాణాలతో కూడిన నాణ్యమైన విద్యనందించేందుకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో పుల్కల్‌ మండలం బస్వాపూర్‌ వద్ద 33 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో ఈ స్కూల్‌ నిర్మాణం ఉంటుందన్నారు. ఈ స్కూల్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తాయన్నారు. ఈ ప్రాంతంలో ఉండే పేద పిల్లలు ఈ స్కూల్లో ప్రవేశం పొందేలా ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఈ స్కూల్లో 5 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉచితంగా విద్యను పొందవచ్చునని ఆయన తెలిపారు.

రూ.168 కోట్లతో సింగూర్‌ కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌

సింగూరు నీటిని సేద్యానికి అందించాలని 2006లో అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ చేతుల మీదుగా కాలువ పనులకు శంకుస్థాపన చేశారని, 2013లో కాలువలను పూర్తి చేసి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు చెరువులను నింపిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.168 కోట్లను మంజూరు చేసిందని, ఈ పనుల ప్రారంభానికి మరో 10 రోజుల్లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిజిఐఐసీ చైర్మన్‌ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు అడిషనల్‌ కలెక్టర్‌లు మాధురీ, మనోజ్‌కుమార్, ఆర్డీఓ పాండు, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, రాష్ట్ర మార్కెట్‌ ఫెడ్‌ డైరెక్టర్‌ ఎస్‌.జగన్మొహన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కౌన్సిలర్లు ఎస్‌.సురేందర్‌గౌడ్, అకుల చిట్టిబాబు, నాని నాగరాజు, మండల కాంగ్రేస్‌ అధ్యక్షుడు దుర్గారెడ్డిలతో పాటు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News