ప్రజలకు ఇబ్బందులు కలగ వద్దు.. ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నియోజకవర్గ నాయకులను ఆదేశించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నియోజకవర్గ నాయకులను ఆదేశించారు. ఆదివారం నియోజకవర్గ నాయకులతో హరీష్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా చెక్ డ్యామ్ లు, చెరువుల పరిస్థితి ఆరా తీశారు. శిథిలావస్థలో ఉన్న నివాసంలో ఉంటున్న వారిని తాత్కాలికంగా సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.
వర్షాలకు నష్టం పోయిన వారికి నష్ట పరిహారం అందించే విధంగా చొరవ చూపాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రావద్దని సూచించారు. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు.