సదాశివపేట ప్రభు మందిరంలో వినాయకుడి విగ్రహం ధ్వంసం..

సదాశివపేట పట్టణ పరిధిలోని పురాతన ప్రభు మందిరం ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు లోపల ఉన్న హనుమాన్ మందిరంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Update: 2024-10-16 12:09 GMT

దిశ, సదాశివపేట: సదాశివపేట పట్టణ పరిధిలోని పురాతన ప్రభు మందిరం ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు లోపల ఉన్న హనుమాన్ మందిరంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయం లోకి చొరబడ్డ ఆగంతకులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను నిలువరించే ప్రయత్నం చేశారు.

వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన స్థలాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి , నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వరరావు దేశ్పాండే, స్థానిక పార్టీ పట్టణ నాయకులు పరిశీలించారు. స్థానిక బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొన్ని రోజుల్లోనే గత మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో జరిగిన సంఘటన మరువక ముందే.. ఈ సంఘటన జరగడం బాధాకరమని, హిందూ దేవాలయాలపై విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని, మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

సదాశివపేటలో ప్రభు మందిరంలో ని హనుమాన్ ఆలయం ఉన్న వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ల మతం ఇస్లాం అనే అనుమానం వ్యక్తం చేశారు. మొదటగా హిందువులకు ఐక్యత ఉండాలని, మనలో మనకు ఐక్యత లేకపోతే ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయని అన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి : విశ్వహిందూ పరిషత్, పలు హిందూ సంఘాలు

మత విద్వేషాలను రెచ్చగొట్టి చర్యలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్, పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఆలయంలోకి వెళ్లి పరిశీలించారు. పోలీసు అధికారులు, స్థానికులను ఘటన కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు మత ఘర్షణలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు బతుకమ్మ, దుర్గామాత నవరాత్రులు ఎంతో ఘనంగా, భక్తి శ్రద్దలతో జరుపుకోవడం జరిగిందని, ఇంతలోనే ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు. ఈ ఘటన తో ఒక వర్గం ప్రజలు తమ మనోభావాలను దెబ్బతీసే చర్యగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు, ముగ్గురు వరకు భాగస్వాములు అయినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారని, ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారో పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని అన్నారు.

సంఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు...

సంఘటన స్థలాన్ని సదాశివపేట సీఐ మహేష్ గౌడ్, తన సిబ్బందితో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. దర్యాప్తు చేసి నిందితులను త్వరగా పట్టుకుంటామని ఆయన తెలిపారు.


Similar News