తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ.. HYD CPగా మళ్లీ సీవీ ఆనంద్
పండుగపూట రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
దిశ, వెబ్డెస్క్: వినాయకచవితి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ కేడర్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్కు బదిలీ చేస్తూ ఆయనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు అప్పగించారు. అలాగే మరోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఉన్న మహేష్ భగవత్కు పోలీస్ పర్సనల్ అండ్ వెల్ఫేర్ అడిషనల్ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంతేకాకుండా పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం. రమేష్కు అదనపు బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్.. విజయ్ కుమార్కు ఏసీబీ డీజీగా కొత్త బాధ్యతలు అప్పగించారు.
కాగా.. సీపీ ఆనంద్ ఇంతకు ముందు కూడా హైదారాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఆ సమయంలో నగరంలో డ్రగ్స్ దందాపై కీలక దృష్టి పెట్టిన ఆయన క్రైం రేటును తగ్గించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాంటి అధికారి మళ్లీ పీసీగా రావడంతో ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.