Mallareddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.

Update: 2024-10-10 09:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తన మనవరాలి పెళ్లికి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందించేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తన మనవరాలి పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని కిషన్ రెడ్డికి మల్లారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. కిషన్ రెడ్డిని నమస్తే అన్న అంటూ మల్లారెడ్డి పలకరించారు. దీంతో కిషన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. సగం సగం చెప్తావేందన్నా అంటూ మల్లారెడ్డి చమత్కారించారు.

దీనికి కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ.. స్వాగతానికి మించి ఏం చెప్పమంటారో మీరే చెప్పాలని వ్యాఖ్యానించారు. అనంతరం కిషన్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాసేపు చర్చించుకున్నారు. దీనిపై మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మా కిషన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసని, ఆయన నా ఫ్రెండ్ అంటూ ఇరువురి మధ్య 30 ఏండ్లకు పైగా పరిచయం ఉందని చెప్పారు. అందుకే తన మనవరాలి పెళ్లికి పిలవడానికి వచ్చానని, రాజకీయ అంశాలు మాట్లాడలేదని, ప్రతిసారి అవే ముచ్చట్లు కావాలా అని అన్నారు. చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టాడని, ఆయన దయవల్ల నేను ఎంపీ అయ్యానని, బీజేపీ, టీడీపీ పొత్తు వల్ల ఆనాడు పార్లమెంట్ కు వెళ్ళానని గుర్తుచేశారు. 


Similar News